వరల్డ్ కప్లో కివీస్ మూడో విజయం.. బంగ్లా చిత్తు!
వన్డే వరల్డ్ కప్లో న్యూజిల్యాండ్ వరుసగా మూడో విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తడబడింది. ముష్ఫికర్ రహీమ్ (66), షకీబ్ అల్ హసన్ (40), మహ్మదుల్లా (41 నాటౌట్) ముగ్గురూ రాణించారు. కానీ మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్కు కూడా ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్గా వచ్చిన రచిన్ రవీంద్ర (9) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే డెవాన్ కాన్వే (45)తో కలిసి కెప్టెన్ కేన్ విలియమ్సన్ (78) మంచి ఇన్నింగ్స్ నిర్మించాడు. ఆ తర్వాత డారియల్ మిచెల్ (89 నాటౌట్)తో చక్కని భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే పరుగు తీసే సమయంలో ఫీల్డర్ వేసిన త్రో వచ్చి తనకు తగలడంతో విలియమ్సన్ రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (16 నాటౌట్)తో కలిసి డారియల్ మిచెల్ లాంఛనం పూర్తి చేశాడు. దీంతో ఆ జట్టు 42.5 ఓవర్లలోనే 248 పరుగులు చేసి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బంతితో మెరిసి మూడు వికెట్లు తీసుకున్న కివీస్ పేసర్ లోకీ ఫెర్గూసన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.