సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణకు.. ఓయు గౌరవ డాక్టరేట్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇవ్వనుంది. ఈ మేరకు వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 5న సాయంత్రం వర్సిటీలో జరగన్ను 82వ స్నాతకోత్సవంలో జస్టిస్ ఎన్.వి.రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. కులపతి హోదాలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరు కానున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం చివరిసారిగా 2001లో ప్రముఖ భారత అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ అరుణ్ నేత్రావలికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తర్వాత రెండు దశాబ్దాలుగా ఎవరికీ ఇవ్వలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి 105 ఏళ్ల చరిత్రలో 81 స్నాతకోత్సవాలు నిర్వహించింది. ఇప్పటి వరికు 47 మందికి మాత్రమే గౌరవ డాక్టరేట్లు ప్రకటించింది. తెలుగు వ్యక్తి అయిన ఎన్.వి.రమణ దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా గతేడాది ఏప్రిల్ 24 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను గౌరవ డాక్టరేట్ను ఎంపిక చేస్తూ ఓయూ నిర్ణయం తీసుకుంది.