పవర్ బ్రోకర్లు, అవకాశవాదులు పార్టీ వదిలిపోతున్నారు: మాజీ మంత్రి హరీశ్రావు
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో పార్టీని వీడుతున్న నాయకులపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు భగ్గుమన్నారు. ఇది ఆకులు రాలే కాలమని, అందుకే పనికిరాని ఆకుల వంటి నాయకులు పార్టీని వీడుతున్నారని హరీశ్రావు నిప్పులు చెరిగారు. దుబ్బాకలో ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెంట్ స్థాయి విస్తృత సమావేశంలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టే. ఇది అన్యాయం కాదా..? ఏం తక్కువ చేసింది పార్టీ వారికి.. అన్ని అవకాశాలు ఇచ్చింది. పార్టీకి అండగా నిలబడ్డ నాయకులను, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం. కానీ ద్రోహం చేసిన వారిని మాత్రం ఎన్నటికీ క్షమించం’’ అంటూ మండిపడ్డారు.
ఇవాళ మన పార్టీ నుంచి కొంతమంది నాయకులు బయటకు పోతున్నారని, కానీ కార్యకర్తలు ఎవరూ వెళ్లకుండా పార్టీతోనే ఉంటున్నారని అన్న హరీశ్రావు.. ఇప్పుడు ఎవడైతే పార్టీ నుంచి పోయారో.. రేపు కాళ్లు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేదని, ఇది పార్టీ నిర్ణయమని స్పష్టం చేశారు. అలాగే పార్టీని వదిలి వెళ్లిపోయే వారిని పవర్ బ్రోకర్లు, అవకాశవాదులతో పోల్చిన హరీశ్రావు.. ఆకులు రాలే కాలంలో చెట్ల నుంచి పనికి రాని ఆకులు రాలిపోయినట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులు రాలి చెత్తకుప్పలో కలిసిపోతున్నాయని విమర్శలు గుప్పించారు. అయితే పోయిన ఆకుల గురించి ఏ మాత్రం బాధ లేదని, ఆకులు రాలిన స్థానంలో మళ్లీ కొత్త చిగురు చిగురిస్తుందని, చెట్టు పచ్చగా వికసిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పని చేసేపార్టీ ఏకైక పార్టీ అని హరీశ్రావు పేర్కొన్నారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డిపై కూడా హరీశ్రావు నిప్పులు చెరిగారు. అసలు రేవంత్ రెడ్డి ఎనాడైనా జై తెలంగాణ అన్నాడా..? అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏనాడూ ఉద్యమంలో జై తెలంగాణ అనలేదని, ఇప్పుడు కూడా అనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్రావు.. ఈనాటి వరకు అమరవీరుల స్థూపం వద్ద ఆయన కనీసం రెండు పూలు పెట్టలేదని, తెలంగాణ మీద ఆయనకు ఏ మాత్రం ప్రేమ లేదని విమర్శించారు. అలాగే దుబ్బాక బీఆర్ఎస్ అడ్డా అని, మెదక్ ఎంపీ స్థానంలో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గెలిచి తీరాల్సిందేనని హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో పట్టున 10 మంది లేకున్నా.. ధైర్యంగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్.. రానే రాదు.. కానే కాదు.. అన్న ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చి పెట్టారన్నారు. తెలంగాణ వస్తుందంటే ఆ రోజు ఎవరూ నమ్మలేదని, కానీ కేసీఆర్ తెలంగాణను తెచ్చిపెట్టాడని హరీశ్రావు గుర్తు చేశారు.