సంక్షోభం నుంచి ఆప్ గట్టెక్కేదెలా..?
అవినీతిపై పోరాటంలో నుంచే ఆ పార్టీ పుట్టింది. ప్రజాప్రతినిధులపై వచ్చే అవినీతి ఆరోపణల మీద విచారణ జరిపేందుకు లోకాయుక్తను ఏర్పాటు చేయాలన్న డిమాండుతో ఎంతో కాలం పోరాటం చేసింది. క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకూ అవినీతిని అంతమొందించాలనేదే ఆ పార్టీ మూల సూత్రం. అవినీతిపై పోరాటం ద్వారానే గుర్తింపు వచ్చింది. దాని అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రే అయ్యారు. పొరుగున ఉన్న పంజాబ్లోనూ పాగా వేసింది. అలాంటి పార్టీ అదే అవినీతి ఊబిలో అనూహ్యంగా కూరుకుపోయింది. రెండేళ్లలోనే ఆ పార్టీ కీలక నేతలు వరుసగా జైలు పాలయ్యారు.అవినీతిపై పోరాటం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించి దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారి అతి తక్కువ కాలంలోనే జాతీయ హోదా సాధించుకున్న రాజకీయ పక్షం.. సార్వత్రిక ఎన్నికల వేళ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధినేత కేజ్రీవాల్, సీనియర్ నేతలు మనీశ్ సిసోదియా, సంజయ్ సింగ్లు జైల్లో ఉండటంతో పార్టీని నడిపించేదెవరన్న చర్చ మొదలైంది.
అంతా తానై..
కేజ్రీవాల్ తన విజన్కు అనుగుణంగానే ఆప్ను జాతీయ పార్టీ స్థాయికి తీసుకొచ్చారు. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, గుజరాత్లలో చెప్పుకోదగిన స్థాయిలో ఆప్ క్యాడర్ ఉందంటే దానికి కారణం కేజ్రీవాల్ విజనే. ఇప్పుడు లోక్సభ ఎన్నికల తరుణంలోనూ ఇండియా కూటమితో పొత్తు పెట్టుకుని కీలక పోరుకు సిద్ధమయ్యారు. అయితే 55ఏళ్ల కేజ్రీవాల్ అరెస్టుతో అంతా తలకిందులైంది. ఆయనకు విశ్వాసంగా ఉండే సిసోదియా, సంజయ్ సింగ్ జైల్లోనే ఉన్నారు. మరో విశ్వాసపాత్రుడు సత్యేందర్ జైన్ మరో కేసులో కారాగారంలోనే ఉన్నారు.
దశాబ్దకాలంలో ఎన్నో మార్పులు
దాదాపు దశాబ్దకాల ఆప్ రాజకీయంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీగా ప్రకటించుకున్న కేజ్రీవాల్ ప్రస్తుతం ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరారు. గతంలో BJP హిందుత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన ఇటీవల హిందుత్వకు కొంత సానుకూలంగా మాట్లాడుతున్నారు. భక్తులను ఉచిత యాత్రల పథకంతోపాటు కరెన్సీ నోట్లపై వినాయకుడు, లక్ష్మీదేవి చిత్రాలను ముద్రించాలనే స్థాయికి వచ్చారు.
అరెస్టైనా సీఎంగా కొనసాగొచ్చు...
మద్యం విధానంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కొనసాగవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా చేయలేదని, అవసరమైతే జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని ఆప్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంగా కేజ్రీవాల్ కొనసాగవచ్చా.. అన్న ప్రశ్నకు....సీఎంగా అరెస్టైన వ్యక్తి ఆ పదవిలో కొనసాగడంపై చట్టంలో ఎలాంటి నిషేధం లేదు. సాంకేతికంగా జైలు నుంచి పరిపాలించడం సాధ్యమేనని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు.మరికొందరేమో.. చట్టపరంగా ఎలాంటి నిషేధం లేకున్నా పరిపాలనా పరంగా కొనసాగడం అసాధ్యమేనంటున్నారు.