కేరళ సీఎం కుమార్తెపై మనీ లాండరింగ్ కేసు
దేశంలో మరో ముఖ్యమంత్రికి ఈడీ సెగ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో సదరు సీఎం కుమార్తెపై కేసు నమోదు చేసినట్లు ఈడీ ప్రకటించింది. కంపెనీలతో అక్రమ లావాదేవీలు జరిపారనేరి ఆమెపై ప్రధాన ఆరోపణ. వివరాల్లోకి వెళితే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ.
ఈడీ కేసు ఎందుకు నమోదు చేసింది..?
వీణా విజయన్ కు చెందిన ఐటీ కంపెనీపై కొరడా ఝళిపించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. మనీ లాండరింగ్ చట్టం (PMLA) చట్టం కింద కేసు నమోదు చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక మినరల్ కంపెనీ వీణా విజయన్ సంస్థకు అక్రమంగా చెల్లింపులు జరిపిందనేది ఆమెపై ప్రధాన ఆరోపణ. 'సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టికేషన్ ఆఫీస్' అనే సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు.. ఈడీ ఈ కేసు నమోదు చేసింది.
అక్రమ లావాదేవీలు ఎలా జరిగాయి..?
ఈడీ నుంచి అందిన సమాచారం మేరకు..'కొచిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్' అనే ప్రైవేటు సంస్థ కొచ్చిలో ఉంది. ఈ సంస్థ 2017, 2018లో వీణా విజయన్కు చెందిన ఎక్సలాజిగ్ సొల్యూషన్ సంస్థకు రూ.1.72 కోట్లు చెల్లించింది. సాధారణంగా ఏదైనా వస్తువు కొనుగోలు చేసినా లేదా ఏదైనా సర్వీస్ తీసుకున్నా ఒక సంస్థ మరో సంస్థకు చెల్లింపులు చేయడం సహజం. కానీ సీఎంఆరెల్ సంస్థ మాత్రం ఇవేవీ లేకుండానే చెల్లింపులు చేసిందనేది ఈడీ వర్గాల ప్రధాన ఆరోపణ. ఒక ప్రముఖ వ్యక్తితో వీణా విజయన్కు సత్సంబంధాలుండడం వల్లనే ఈ సంస్థ నెలవారీ చెల్లింపుల రూపంలో వీణా విజయన్ కంపెనీకి ఈ చెల్లింపులు జరిపేదని ఈడీ అంటోంది.
ఇదిలా ఉంటే.. ఇంతకు ముందు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ చేసిన దర్యాప్తుకు వ్యతిరేకంగా ఎక్సలాజిక్ కంపెనీ కర్ణాటక హైకోర్టుకు వెళ్లింది. అయితే, ఆ పిటిషన్ను కోర్టు గత నెల కొట్టేసింది. ఇక ఇప్పుడు ఏకంగా ఈడీ రంగంలోకి దిగి మనీలాండరింగ్ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే గత జనవరిలోనే అసెంబ్లీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, తన భార్య రిటైర్మెంట్ ప్రయోజనాలతో తన కుమార్తె ఐటీ కంపెనీ పెట్టిందని, తన కుమార్తె పైన, తన కుటుంబం పైన చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. ఇక తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీ సర్కార్ ప్రతిపక్షాలను అణచివేస్తోందనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసు నమోదవడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.