మరోసారి కమలాతో కలిసే ప్రజా క్షేత్రంలోకి : బైడెన్
అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్తో కలిసే మరో విడత ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 2024 ఎన్నికల్లో ఆమె తన సహచరిణిగా ఉంటారని ఆయన తెలిపారు. అధ్యక్షుడిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బైడెన్ మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల గురించి తాను, బైడన్ ఇంకా చర్చించుకోలేదని గత నెలలో కమలా హారిస్ ప్రకటించడం గమనార్హం. ఒక వేళ బైడెన్ ఆమెను ఎంపిక చేసుకోకపోతే పోటీకి ఆమె దూరంగా ఉంటారన్న వార్తలు వచ్చాయి. అమెరికా చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమల చరిత్ర సృష్టించడం విదితమే. ఈ నేపథ్యంలో కమల పని తీరు పట్ల బైడెన్ సంతృప్తిగానే ఉన్నారు. వోటింగ్ హక్కుల అంశం పరిష్కారంలో ఆమె పని తీరుకు మద్దతుగా పలికారు. నేను ఆమెకు బాధ్యతలు అప్పగించాను. తన ధర్మాన్ని ఆమె చక్కగానే నిర్వహించారు అని బైడెన్ ప్రకటించారు.