పాత ఫోటోతో జగన్ పై బురద చల్లే ప్రయత్నం..
ప్రజలకు మంచిని పంచడానికి వినియోగించాల్సిన సోషల్ మీడియాలు కొందరి స్వార్థానికి బలవుతున్నాయి. ప్రజలను అనవసరంగా ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు చెప్పి మభ్యపెట్టడానికి సాధనాలుగా మారుతున్నాయి. తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆరెస్సెస్, బీజేపీ నేత రామ్ మాధవ్ ను కలిసారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .దీనికి సంబంధించిన ఫోటో కూడా వైరల్ అవుతుంది.
ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో జగన్.. రామ్ మాధవ్ తో భేటీ ఎందుకు అయ్యారు? ఆరెస్సెస్ ప్రముఖ నేతను జగన్ కలవడం వైసీపీ వైపు ఉన్న ముస్లింలకు ఆనందంగా ఉందా.. అని ప్రచారం కూడా చేస్తున్నారు. అసలు ఇప్పుడు జరగని విషయం జరిగిందని ప్రచారం ఎలా చేస్తున్నారు అని ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. నిజం ఏమిటంటే ఈ ఫోటో ఇప్పుడు తీసింది కాదు.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జగన్ ఘన విజయాన్ని సాధించిన తర్వాత ఓ సందర్భంలో రామ్ మాధవ్ ఆయన్ని కలిశారు. ఆ ఫోటోని మే 26 2019లో ఏ.ఎన్.ఐ. న్యూస్ ఏజెన్సీ లో ప్రచురించారు. అప్పటి ఫోటోని ఉపయోగించి ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించి.. జగన్ ను మైనారిటీలకు దూరం చేయడానికి పన్నిన కుట్ర ఇది అన్న విషయం బాగా అర్థమైపోతుంది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని ఈ నేపథ్యంలో పరిశీలకులు సూచిస్తున్నారు.