రాజవంశాలకు షాక్..భజన్లాల్ కు పట్టం..
రాజస్థాన్ ముఖ్యమంత్రి విషయంలో సస్పెన్ష్కు తెరదించింది బీజేపీ. సీఎం పదవికోసం పోటీపడిన రాజవంశీయులను పక్కనపెట్టి... ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్లాల్ శర్మను సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్షనేతగా భజన్లాల్ శర్మను ....సీఎల్పీ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. భజన్లాల్ తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గడం గమనార్హం. డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి, ప్రేమచంద్ భైరవను బీజేపీ ప్రకటించింది. అదే విధంగా స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని ఎంపిక చేసింది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో వసుంధర రాజే, దియాకుమారి, అర్జున్రామ్, గజేంద్ర షెకావత్, అశ్విని వైష్ణవ్ లాంటి సీనియరల పేర్లు వినిపించాయి. తీవ్ర సస్పెన్స్ కొనసాగించిన అనంతరం బీజేపీ అధిష్టానం.. చివరి నిమిషంలో భజన్లాల్ పేరును తెరపైకి తెచ్చింది. చివరకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్ విషయంలోనూ కొత్త ముఖాన్ని ఎంచుకుంది. 56 ఏళ్ల భజన్ లాల్ శర్మ.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. భజన్ లాల్ రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్పై 48,081 ఓట్లతో విజయం సాధించారు.
భజన్లాల్ స్వస్థలం భరత్పూర్. కానీ, ఆయనకు ఆ టికెట్ను బీజేపీ ఇవ్వలేదు. అక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఆయన ఓడిపోతారని బీజేపీ భావించింది. అందుకే సంగనేర్ టికెట్ ఇచ్చింది. అక్కడా ఆయన నెగ్గుతారని ఊహించలేదట. అయితే.. సంగనేర్ టికెట్ మీద పోటీ చేసి భజన్లాల్ 48వేలపైగా మెజారిటీతో నెగ్గారు. భజన్లాల్ మొదటి నుంచి బీజేపీ పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొనేవారు. అత్యంత ఎక్కువ కాలం బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నారు. బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీలో విద్యార్థి నాయకుడి పనిచేశారు. ఓసీ సామాజికవర్గానికి చెందిన భజన్ లాల్ రాజస్థాన్ వ్యాప్తంగా నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పార్టీలో ఉన్న అన్ని వర్గాల కార్యకర్తలతో సన్నిహితంగా మెలిగేవారు. 56 ఏళ్ల భజన్లాల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో రూ. 1.5కోట్ల ఆస్తులను చూపించారు.
అయితే దశాబ్దాల నుంచి రాజస్థాన్లో రాజవంశీయుల హవా నడుస్తోంది. ప్రధాని మోడీ ఇప్పుడా అధికారాన్ని .. ఇతర సామాజికవర్గాలకు కట్టబెట్టారు. అయితే చూస్తూ..చూస్తూ, తమ అధికారాన్ని లాక్కోవడాన్ని రాజవంశీయులు సహిస్తారా..? ఈ రాజకీయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ విషయంలో ఇదే టాక్ నడుస్తోంది.