పీవీకి భారతరత్న కోసం ఎన్నారైల ఢిల్లీ పర్యటన
భారత మాజీ ప్రధాని.. మన తెలుగుజాతి ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలంటూ, అమెరికాలోని ఎన్నారైల డిమాండ్ను ప్రవాస భారతీయ సంఘాల తరపున కేంద్రానికి తెలియజేసేందుకు అమెరికా నుంచి తెలుగువారితో వచ్చిన ఎన్నారై బృందం ఢిల్లీలో ప్రధాని కార్యాలయంతోపాటు ఇతర కేంద్రమంత్రులను కలుసుకుని వినతిపత్రాన్ని ఇచ్చింది.
అమెరికాలో పీవీ చేసిన సేవలను అందరికీ తెలియజేసేలా గత కొద్దినెలలుగా ఎన్నారైలు, ఎన్నారై సంఘాలు కొన్ని కార్యక్రమాలను వరుసగా నిర్వహించాయి. రిమెంబరింగ్ పీవీ సిరీస్లా మూడు ఆర్లతో ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లారు. రిమెంబరింగ్ పీవీ నరసింహా రావు, రిమైండ్ పీపుల్, రిక్వెస్ట్ భారత ప్రభుత్వం భారతరత్నఫర్ పీవీ డిమాండ్తో ప్రవాస భారతీయ సంఘాలు కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆన్లైన్ ద్వారా తమ డిమాండ్కు భారతీయుల మద్దతును కోరాయి. అనేక ప్రవాస భారతీయ సంఘాలు, సంస్థలు పీవీ శత జయంతోత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 2020 నుండి డిసెంబర్ 2020 వరకు పీవీ ఘనతను స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు చేశాయి. దీనిలో భాగంగా గ్రాండ్ ఫినాలేను పురస్కరించుకుని ప్రవాస భారతీయ సంఘాల ముఖ్య నేతలు భారత్లో పర్యటించి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
డిసెంబర్ 23న పీవీ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల సమక్షంలో ప్రత్యేకంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ మద్ధతుగా రూపొందించిన లఘు చిత్రం, క్యాలెండర్ను విడుదల చేశారు. న్యూఢిల్లీలో పీవీ పేరిట రూపొందించిన ప్రత్యేకమైన సంచికను(పీవీ శతజయంతి వేడుకలు: ఎన్నారైస్ ఎన్నారై సంస్థలు) విడుదల చేసి పలువురు రాజకీయ ప్రముఖులకు అందజేశారు. ఎన్నారై సంస్థల సంతకాలతో కూడిన పిటిషన్ను ఎన్నారైస్, పీవీ కుటుంబ సభ్యుల ప్యానెల్ తరపున ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కార్యాలయాలకు అందించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్నారై సంస్థల ప్యానెల్ కొంతమంది రాజకీయ ప్రముఖులను కూడా కలిశారు.
ఈ సందర్భంగా దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తు చేస్తూ.. ఆయన శతజయంతి సందర్భంగా 2020లో భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరారు. విజయ్ చౌతైవాలే (ఇన్ఛార్జి, విదేశీ వ్యవహారాల శాఖ సభ్యుడు), జి. కిషన్ రెడ్డి (భారత హోం సహాయ మంత్రి), బండి నరసయ్య సంజయ్ కుమార్ పటేల్ (ఎంపి,బిజెపి అధ్యక్షుడు, తెలంగాణ), ప్రకాష్ జవదేకర్ (పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ మంత్రి, సమాచార మరియు ప్రసార మంత్రి), సుబ్రమణియన్ స్వామి (రాజ్యసభ పార్లమెంటు సభ్యుడు), అరవింద్ ధర్మవరపు (పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ), అనిల్ శాస్త్రి (మాజీ ఎంపీ లాల్ బహదూర్ శాస్త్రి మనవడు), నరేంద్ర మోదీ కార్యాలయ కార్యదర్శి, గజేంద్ర సింగ్ షేఖావత్(కేంద్ర కేబినెట్ మంత్రి, జల్ శక్తి). అమిత్ షా కార్యాలయ కార్యదర్శి, శ్రీరామ్ వెదిరే (చైర్మన్ జల వనరుల ప్రణాళిక అథారిటీ)తో పాటు మరికొంతమంది నేతలను ఎన్నారై ప్యానెల్ సభ్యులు కలిసి పీవీకి భారతర్న ఇవ్వాలని విన్నవించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్, ఢిల్లీలో తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలకు సహకరించిన పీవీ కుటుంబ సభ్యులు పీవీ ప్రభాకర్ రావు, వాణీ సురభి రావు, ఎన్వీ సుభాష్(పీవీ మనవడు)తో పాటు డా. సరస్వతి కల్వకోటకు ఎన్నారై ప్యానెల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది. ఇక తాము గ్రాండ్ ఫినాలే ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో పాటు ప్రజల మద్దతు కేంద్రంలోని ప్రభుత్వానికి చేరుతుందని, పివి నరసింహరావుకు భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని ఎన్నారై ప్యానెల్ ఆశాభావం వ్యక్తం చేసింది.
అమెరికాలోని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(AAPI), ఉత్తర అమెరికా తెలుగు సంఘము(TANA), అమెరికా తెలుగు సంఘం(ATA), నాట్స్ (NATS), ఉత్తర అమెరికా తెలుగు సమితి(NATA), సిలికానాంధ్ర, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(TDF), సెయింట్ లూయిస్ గుజరాత్ సమాజ్తో పాటు అమెరికాకు చెందిన 81 సంస్థలు పీవీకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ను బలంగా వినిపిస్తూ, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయి. ఇక ఎన్నారై కార్య నిర్వాహక బృంద సభ్యులు స్వర్ణ ప్రసాద్, గుళ్ళపల్లి శ్రీనివాస్, డాక్టర్ అశోక్ కుమార్, చింతా ప్రవీణ్, తాళ్లూరి శ్రీధర్, అశ్విన్ పటేల్, కాజా విశ్వేశ్వర రావు(సెయింట్ లూయిస్), బడ్డి అశోక్, దేవబత్తిని హరి(డెట్రాయిట్), మేడిచెర్ల మురళీకష్ణ, కపిల ప్రకాష్, శరత్ చంద్ర(ఎడిసన్), పురం ప్రవీణ్ (అట్లాంటా), కొండెపు సుధ(వాషింగ్టన్ డీసీ) , చల్లా కవిత(టీడిఎఫ్ USA ప్రెసిడెంట్, వాషింగ్టన్ డీసీ), అట్లూరి శ్రీహరి (లాస్ ఏంజెల్స్), కల్వకోట సరస్వతి (ఒహాయో) ఇలా చాలా మంది ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు పీవీకి భారతరత్న డిమాండ్ను ముందుకు తీసుకువెళ్ళిన వారిలో ఉన్నారు.