ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

శ్రీనివాస్ కూకట్ల ఆధ్వర్యంలో అద్దంకిలో ‘తానా చైతన్య స్రవంతి’ విజయవంతం

శ్రీనివాస్ కూకట్ల ఆధ్వర్యంలో  అద్దంకిలో ‘తానా చైతన్య స్రవంతి’ విజయవంతం

అద్దంకి పట్టణంలో తానా ఈవెంట్స్‌ కో ఆర్డినేటర్‌, ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాస్‌ కూకట్ల ఆధ్వర్యంలో 2022 డిసెంబర్‌ 23 నుండి 27వ తేదీ వరకు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. అద్దంకిలో ‘‘తానా’’,  ‘‘కూకట్ల ఫౌండేషన్‌’’, ‘తానా ఫౌండేషన్‌’’ మరియు పలువురు దాతలు సహకారంతో ఐదు రోజులు పాటు వైద్య శిబిరాలు, వివిధ క్రీడా పోటీలు, రైతు సేవా కార్యక్రమాలు, వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ ల పంపిణీ, లాప్‌ టాప్‌ ల బహుకరణ, పలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

డిసెంబర్‌ 25వ తేదీన తానా కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ కూకట్ల ఆధ్వర్యంలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ జనార్ధన్‌ నిమ్మలపూడి, చైతన్య స్రవంతి కోఆర్డినేటర్‌ సునీల్‌ పాంట్ర, తానా టెంపుల్‌ కోఆర్డినేటర్‌ జగదీశ్వరరావు పెద్దబోయిన అప్పలాటిన్‌ రీజినల్‌ రిప్రెసెంటేటివ్‌ నాగ పంచుమర్తి, తాన స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ శశాంక్‌ యార్లగడ్డ తదితర అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణ ప్రముఖులు అధిక సంఖ్యలో ప్రజానీకం హాజరు కావడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.

సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకున్న తానా టీం

ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని డిసెంబర్‌ 25వ తేదీన తాన అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ కూకట్ల , బోర్డు మెంబర్‌ జనార్ధన్‌ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వీరికి ఆలయ చైర్మన్‌ కోటా శ్రీనివాస్‌ కుమార్‌ మేళతాళాలు వేద పండితుల మంత్రాచారాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వీరికి స్వామివారి ప్రసాదములు వేద ఆశీర్వచనాలు స్వామి వారి చిత్రపటాలను చైర్మన్‌ కోటా శ్రీనివాస్‌ కుమార్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ కోరిక మేరకు దేవస్థానానికి 120 కే.వి జనరేటర్‌ ను తానా ఫౌండేషన్‌ కూకట్ల ఫౌండేషన్‌ తరపున ఇచ్చేందుకు అంజయ్య చౌదరి, శ్రీనివాస్‌ ఇరువురు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గారు మాట్లాడుతూ కుకట్ల ఫౌండేషన్‌ ద్వారా అనేక రకాల సేవలు అందిస్తున్న శ్రీనివాస్‌ కూకట్ల అద్దంకి ప్రాంత శ్రీమంతుడని ఇలాంటి వ్యక్తి అద్దంకిలో ఉండటం ఈ ప్రాంత వాసులకు గర్వకారణమన్నారు. తాన డైరెక్టర్‌ జనార్ధన్‌ నిమ్మలపూడి మాట్లాడుతూ కుకట్ల సోదరులు శ్రీనివాస్‌, వెంకటకృష్ణ, హరీష్‌ చౌదరి ల సేవా దృక్పథాన్ని కొనియాడారు. అద్దంకి ప్రాంత ప్రముఖులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు కూకట్ల శ్రీనివాస్‌ చేసిన పలు సేవలను అభినందించారు. శ్రీనివాస్‌ కూకట్ల మాట్లాడుతూ కన్నతల్లికి పుట్టిన గ్రామానికి సేవ చేయడం కన్నా మంచి కార్యక్రమం మరేది లేదని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారకులైన తన తల్లిదండ్రులు సుబ్బారావు, విద్యావళిలను ఆయన సత్కరించారు.

ప్రజల్లో అవగాహన కల్పించిన ‘‘క్యాన్సర్‌ అవేర్నెస్‌ వాక్‌‘‘

క్యాన్సర్‌ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌ వ్యాధిపై ప్రజలకు అవగాహన లేకపోవటం మూలంగా వ్యాధి ముదిరి చివరి దశలో గుర్తించటం వ్యాధి నయం కాక మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించి క్యాన్సర్‌ వ్యాధిపై ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించేందుకు కూకట్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘‘క్యాన్సర్‌ అవేర్నెస్‌ వాక్‌’’ కార్యక్రమం జరిగింది. అద్దంకి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నుండి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు పలు స్వచ్ఛంద సంస్థలు, సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థలు, పలు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి శ్రీనివాస్‌ కూకట్ల నిర్వహించిన ర్యాలీ ప్రజలను విశేషంగా ఆకట్టుకొని ఆలోచింపజేసింది.

"కూకట్ల ఫౌండేషన్‌’’ వైద్య శిబిరాలు

డిసెంబర్‌ 25వ తేదీన అద్దంకిలోని కుకట్ల కన్వెన్షన్‌ హాల్లో క్యాన్సర్‌, కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. కూకట్ల ఫౌండేషన్‌, గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వైద్యులు 115 మందికి క్యాన్సర్‌ వైద్య పరీక్షలు నిర్వహించారు.  హైదరాబాద్‌ నుండి వచ్చిన ప్రత్యేక బస్సులో అవసరమైన వారికి ఉచితంగా క్యాన్సర్‌ గుర్తింపు ఎక్సరేలను తీశారు. అదేవిధంగా కంటిశుక్లాలు వివిధ రకాల కంటి జబ్బులు ఉన్నవారికి ఒంగోలు స్మార్ట్‌ విజన్‌ ఐ హాస్పిటల్‌ వారి సహకారంతో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతేకాకుండా ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 60 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోడులను పంపిణీ చేశారు.

వాలీబాల్‌ పోటీలు

అద్దంకి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో కూకట్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వాలీబాల్‌ పోటీలు జరిగాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి 15 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనగా కరువది జట్టు విజేతగా నిలిచింది.

రైతు కోసం కార్యక్రమాలు...

రైతు కోసం కార్యక్రమాన్ని కూడా తానా ఫౌండేషన్‌ సహకారంతో శ్రీనివాస్‌ కూకట్ల ఏర్పాటు చేశారు. వ్యవసాయ కుటుంబం నుండి ఉన్నత స్థానానికి వచ్చిన శ్రీనివాస్‌ కూకట్ల రైతుల శ్రేయస్సు కోసం, వారి రక్షణ కోసం దాతల సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అద్దంకిక చెందిన ఎన్‌ఆర్‌ఐ చట్టబత్తిన కృష్ణ కిషోర్‌ డొనేట్‌ చేసిన 25 పవర్‌ స్పేయర్లను రైతులకు పంపిణీ చేశారు. అదేవిధంగా కూకట్ల ఫౌండేషన్‌, సురేష్‌ జాగర్లమూడి డొనేట్‌ చేసిన 170 రైతు రక్షణ కిట్లను సభలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో రైతుల పాల్గొన్నారు.

వికలాంగులకు ట్రై సైకిల్స్‌, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

తానా ఫౌండేషన్‌, కూకట్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సుమారు వందమంది వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు మరియు 10 ట్రై సైకిల్స్‌ రెండు బ్యాటరీతో నడిచే సైకిల్స్‌ లను వికలాంగులకు శ్రీనివాస్‌, అంజయ్య చౌదరి పంపిణీ చేశారు.

విద్య, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు

ప్రతిభ కలిగి ఉండి పేదరికం కారణంగా విద్య మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో కూకట్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శ్రీనివాస్‌ కూకట్ల సుమారు లక్ష రూపాయలను విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ రూపంలో పంపిణీ చేశారు.

తండ్రి బాటలో తనయ ‘నేహ’

తన చుట్టూ ఉన్న సమాజం బాగుంటే దేశం బాగుంటుందని నమ్మి , సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పాటు అందించే వ్యక్తి శ్రీనివాస్‌ కూకట్ల. వారి బాటలోనే వారి కుమార్తె నేహ కూడా సామాజిక సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తూ చిన్నవయసులోనే పలువురికి ఆదర్శంగా నిలిచింది. నేహా గత సంవత్సరం తన జన్మదినాన్ని అందరిలా స్నేహితులు, బంధువులు మధ్య కాకుండా అద్దంకిలోని బదిరుల ఆశ్రమ పాఠశాలలో చెవిటి, మూగ విద్యార్థుల మధ్య జరుపుకొని ఆ రాత్రి అక్కడే ఉండి తానే అక్కడ విద్యార్థులు అందరికీ స్వయంగా చేతులకు మెహింది పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా తాను స్వయంగా విరాళాలు సేకరించి మేదరమెట్ల జిల్లా పరిషత్‌ హైస్కూల్లో తానా ఫౌండేషన్‌ వారి సహకారంతో 1000 లీటర్ల మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయించింది. ఇటీవలే దీనిని ప్రారంభించారు.

20 మంది ప్రముఖులకు సన్మానం

తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల సందర్భంగా డిసెంబర్‌ 25వ తేదీన అద్దంకి, పరిసర ప్రాంతాల్లో సాహిత్యం , సామాజిక సేవ, సాంస్కృతికం, జానపదం, సంగీతం,  కళలు వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన 20 మంది ప్రముఖులకు ముఖ్య అతిథి అంజయ్య చౌదరి చేతుల మీదుగా ఘన సన్మానం చేశారు. పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి (సాహిత్యం), ఉబ్బా దేవపాలన (జానపదం), వీరవల్లి సుబ్బారావు రుద్రయ్య (సామాజిక సేవ), సందిరెడ్డి శ్రీనివాసరావు (రోటరీ క్లబ్‌) ఇలపావులూరు శేష తల్ప సాయి ( ప్రకాశం మిత్ర మండలి), జి శేషగిరి (సంగీతం), జ్యోతి చంద్రమౌళి (చారిత్రకం),  చుండూరు మురళి సుధాకర్‌ (రక్తదానం), మన్నం త్రిమూర్తులు (నందమూరి కళాపరిషత్‌) మోటుపల్లి రామదాసు (ఘంటసాల గాన భారతి), చిన్న మురళీకృష్ణ (చారిటబుల్‌ ట్రస్ట్‌) చందలూరు నారాయణరావు (సాహిత్యం) చెన్నుపల్లి నాగేశ్వరరావు (జానపద కళలు) పంతంగి జ్యోతయ్య (సామాజిక సేవ) రాచమల్లు శివ (సామాజిక సేవ) చల్ల కాశయ్య (సామాజిక సేవ), చాగంటి శేషారెడ్డి (సోషల్‌ సర్వీస్‌), పసుమర్తి కోటయ్య (జాషువా కళాపీఠం), సందిరెడ్డి కొండలరావు (జర్నలిజం) ఉన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు          

కార్యక్రమాల ముగింపు సందర్భంగా కూకట్ల కన్వెన్షన్‌ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్థానిక బెల్‌ అండ్‌ బెన్నెట్‌ పాఠశాల విద్యార్థులతో పాటుగా, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మరియు పేరెన్నిక గల కళాబృందాలు, విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ఫోక్‌ ఆర్కెస్ట్రా ప్రేక్షకులను కనువిందు చేశాయి.

 

 

Tags :