ASBL NSL Infratech

మన ఊరు-మన బడిలో భాగస్వాములు కండి.. అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలను ఆహ్వానించిన కేటీఆర్

మన ఊరు-మన బడిలో భాగస్వాములు కండి.. అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలను ఆహ్వానించిన కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి పథకాల్లో అమెరికాలో ఉంటున్న తెలంగాణ ఎన్నారైలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు కోరారు. అమెరికా పర్యటలో భాగంగా శాన్‌హోసెలో ఇండియన్‌ అమెరికన్‌ డయాస్పొరా ఏర్పాటుచేసిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌ విత్‌ కేటీఆర్‌’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మన ఊరు ` మన బడి కార్యక్రమం ఎన్‌ఆర్‌ఐలపై ఆధారపడి ఏర్పాటుచేసినది కాదని, కానీ పుట్టిన ఊరు, పుట్టిన రాష్ట్రం, మాతృదేశానికి సేవ చేసుకొనేందుకు ఈ పథకం మంచి అవకాశమని తెలిపారు. ఈ సందర్భంగా మన ఊరు- మన బడి ఎన్‌ఆర్‌ఐ పోర్టల్‌ను ఆవిష్కరించారు.

మాతృభూమికి సేవ చేయటంలో గొప్ప సంతృప్తి ఉంటుందని మంత్రి కేటీఆర్‌ ఆన్నారు. ‘మాతృభూమికి దూరంగా ఉండేవాళ్ల ఆరాటం నాకు తెలుసు. ముఖ్యంగా వేల మైళ్ల దూరంలో ఉన్నవాళ్లకు పుట్టిపెరిగిన ఊరికి ఏదైనా చేయాలన్న కోరిక ఉంటుంది. నేను కూడా ఇక్కడే (అమెరికాలో) ఆరున్నరేండ్లు ఉన్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. మీరు మీ పేరును సార్థకం చేసుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తున్నది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మన ఊరు ` మన బడి కార్యక్రమంలో భాగస్వాములు కండి. గుడులు కట్టించేవాళ్లు గుడులు కట్టించండి. బడులు కట్టించేవాళ్లు బడులు కట్టించండి. కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలనుకొంటే ఇవ్వండి. దానివల్ల మీకు లభించే సంతృప్తి మరే ఇతర పనుల వల్ల రాదు. మీ గ్రామంలో పాఠశాలలు బాగు చేయిస్తే అక్కడి ప్రజలు చూపే ఆదరణ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. పాఠశాలలు అభివృద్ధి చేస్తే వాటికి మీ పేరు లేదా మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకొనే అవకాశం కూడా ఉన్నది. దీంతో మీ పేరు సార్థకమవుతుంది. రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రైవేటు వ్యక్తుల సహకారం తీసుకోవాలని అనుకొంటున్నాం. మీకు ఇష్టమున్న పాఠశాలను ఎంపిక చేసుకొని అభివృద్ధి చేయండి.’ అని మంత్రి కేటీఆర్‌ సూచించారు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం కూడా ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలి. మీకు మించిన బ్రాండ్‌ అంబాసిడర్స్‌ ఎవరూ ఉండరు. తెలంగాణ గురించి మీరే గొప్పగా ప్రచారం చేయగలరు. అభివృద్ధిలో ముందంజలో ఉన్నాం. విద్యావ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు తెలంగాణలో కేవలం మూడు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కొత్తగా 33 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని కేటీఆర్‌ తెలిపారు. అలా వైద్య విద్యతో పాటు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ను పటిష్టం చేస్తున్నామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

అభివృద్ధిలో తెలంగాణ ముందంజ

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనీస సదుపాయాలపై దృష్టి సారించామని స్పష్టం చేశారు. దేశానికి నిధులు సమకూరుస్తున్న నాలుగో అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ 14 శాతం వృద్ధిరేటు నమోదు చేశాం. దేశ జనాభాలో తెలంగాణ 12వ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి కరెంట్‌ కోతలతో తెలంగాణ అల్లాడుతోంది. కరెంట్‌ సమస్యను సీఎం కేసీఆర్‌ తొలి ఆరు నెలల్లోనే పరిష్కరించారు. విద్యుత్‌ వ్యవస్థాపక సామర్థ్యం 7 వేల మెగావాట్ల నుంచి 16 వేల మెగావాట్లకు పెంచామని తెలిపారు.అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని చెప్పారు.

ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందిస్తున్నాం. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేండ్లలోనే పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తున్నాం. తెలంగాణ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. పంజాబ్‌తో సమానంగా వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఒకప్పటి కరువు నేల నేడు దేశానికి అన్నపూర్ణగా మారిందన్నారు. ఇదంతా కేసీఆర్‌ సమర్థవంతమైన పాలన వల్లే సాధ్యమైందన్నారు. టీఎస్‌ ఐపాస్‌ చట్టం అమలు చేసిన తర్వాత తెలంగాణకు పరిశ్రమలు తరలివచ్చాయి. ప్రపంచ స్థాయి కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

 

Tags :