వారి సంక్షేమం కోసం రూ.100 కోట్లకు పైగా నిధులు : లోకేశ్
కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ టీడీపీ అని, వారి సంక్షేమం కోసం రూ.100 కోట్లకు పైగా నిధులు కేటాయించామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. గుంటూరు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. టీడీపీకి 70 లక్షల మంది కార్యకర్తలే ఆస్తి అని, తెలుగుజాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురవేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 50 మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుభానితో పాటు 500 మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ లోకేశ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.