పిఠాపురంలో పవన్ గెలిస్తే నా పేరు మార్చుకుంటా.. ముద్రగడ సవాల్..
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అన్నప్పటి నుంచి ఏపీ రాజకీయాలలో పిఠాపురం హాట్ టాపిక్ గా మారింది. పవన్ గత ఎన్నికల చేదు అనుభవం ఈసారి ఎదురు కాకూడదు అనే పట్టుదలతో పిఠాపురంలో నివాసం ఏర్పాటు చేసుకుని మరి ప్రచారం సాగిస్తున్నారు.ఈసారి ఎలాగైనా పిఠాపురంలో పవన్ గెలవాలి అని మెగా ఫ్యామిలీ కూడా తమ వంతు సపోర్టును అతనికి అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ను పిఠాపురంలో ఓడించడం ఖాయమని.. లేకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ్డ పద్మనాభం సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ముద్రగడ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రంగులు వేసుకుని వచ్చేవారిని ప్రజలు నమ్మరని.. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదని ముద్రగడ పద్మనాభం అన్నారు. చిన్నతనం నుంచి మనుషులకు విలువ ఇవ్వడం.. మర్యాద ఇవ్వడం తన తండ్రి తనకు నేర్పారని.. ఇంటికి వచ్చిన ఎవరికైనా భోజనాలు పెట్టి పంపుతామని ముద్రగడ పేర్కొన్నారు. కానీ పవన్ విషయం అలా కాదని.. కనీసం తన సినిమా డైరెక్టర్లకి కప్పు కాఫీ కూడా ఇవ్వని పవన్.. అభిమానులను దగ్గరకి కూడా రానివ్వని పవన్.. ప్రజలకు ఏం చేస్తాడు అని ముద్రగడ ప్రశ్నించారు.
అంతేకాదు పవన్ కళ్యాణ్ ఇంట్లో పదిమంది ఉన్నారని.. వాళ్లలో ఎవరి బర్త్డే వచ్చిన ప్రొడ్యూసర్లే భోజనాల దగ్గర నుంచి కేక్ వరకు పంపించాలని.. పవన్ కి డబ్బే ప్రాణమని ముద్రగడ విమర్శించారు. పవన్ రైతుల కోసం చందాలు వసూలు చేశానని చెబుతున్నారు.. కానీ ఏ రైతుకు ఎంత ఇచ్చారో ఎప్పుడైనా చెప్పారా.. ధైర్యం ఉంటే చెప్పమనండి అని ముద్రగడ డిమాండ్ చేశారు. పార్టీ టికెట్లు కూడా అమ్ముకున్న పవన్.. తమ కోసం ఏమీ చేయడు అన్న విషయం ప్రజలకు కూడా తెలుసు అని ముద్రగడ పేర్కొన్నారు.