అంతర్జాతీయ అవార్డు అందుకున్న నరేష్ బాబు... తొలి భారతీయ వైద్యుడిగా గుర్తింపు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకు గాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముఖ శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. స్కోలియోసిస్ రీసెర్చ్ సొసైటీ థామస్ ఈ వైట్క్లవుడ్ పురస్కారంతో సత్కరించింది. ఈ అవార్డు దక్కిన తొలి భారతీయ వైద్యుడిగా ఆయన గుర్తింపు పొందారు. గుంటూరు కొత్తపేటలోని మల్లిక్ స్పైన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేష్ బాబు మాట్లాడారు. మెడ, వెన్ను నొప్పి, చేయి జాలు, తిమ్మిర్లు, నడకలో ఇబ్బందులతో వచ్చిన పలువురు రోగులను పడుకోబెట్టి ఎంఆర్ఐ తీయగా వ్యాధికి సబంధించి ఎలాంటి ఆధారం కనిపించలేదు. ఔషధాలు వాడినప్పటికీ ఫలితం ఉండటం లేదని, నొప్పులు భరించలేకపోతున్నామని పలువురు రోగులు వాపోయేవారు. దీంతో రోగిని కూర్చోబెట్టి, నిటారుగా నిలబెట్టి, తల ముందుకు, వెనక్కి వంచి ఇలా నాలుగు భంగిమల్లో డైనమిక్ ఎంఆర్ఐ యంత్రం ద్వారా స్కానింగ్ తీశారు. మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు.
ఈ విధానంలో తీసిన ఎంఆర్ఐలో రోగి తల బరువు, కదలికల ప్రభావం మెడలోని నరాలపై ఏమేరకు అదనంగా ఒత్తిడి కలగజేస్తుందో చాలా స్పష్టంగా గుర్తించగలిగారు. దీని ఆధారంగా వ్యాధిని నిర్దారించి చికిత్స అందించగా రోగులు పూర్తిగా కోలుకున్నారు. ఈ విధానంలో వ్యాధి నిర్దారణ చేయొచ్చనే విషయాన్ని ప్రపంచంలోనే మొదటిసారి డైనమిక్ పరిశోదన ద్వారా తెలిసింది. కాలిఫోర్నియాలో ఈ నెల 10 నుంచి 15 వరకు నిర్వహించిన స్కోలియో సిస్ రీసెర్చ్ సొసైటీ 31వ అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డును ఆ సొసైటీ అధ్యక్షుడు మారినస్ డీ కైవోర్ అందజేశారు అని తెలిపారు.