నా కుమారుడిని జైల్లో పెట్టేందుకు సీఎం రేవంత్ కుట్ర: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్
తన కుమారుడిని జైల్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారంటూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ కుట్రతోనే తన కుమారుడు రహీల్ను కారు ప్రమాదం కేసులో ఇరికించారని ఆరోపించారు. ప్రస్తుతం దుబాయిలో ఉన్న షకీల్.. ఈ మేరకు బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ షకీల్.. ‘‘ఓ కారు యాక్సిడెంట్ కేసులో 21 కేసులు ఎలా పెడతారు..? రాజకీయంగా మనం మనం చూసుకుందాం. కానీ ఇందులోకి పిల్లలను లాగొద్దు. వారిని ఇబ్బంది పెట్టొద్దు’’ అని పేర్కొన్నారు. తాను ప్రస్తుతం దుబాయ్లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని, తన కుమారుడికి ఏం జరిగినా పోలీసు ఉన్నతాధికారులదే బాధ్యతని హెచ్చరించారు. తనకు తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని, కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని షకీల్ డిమాండ్ చేశారు.