నేను ముఖ్యమంత్రిగా చేశాను.. కానీ ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు.. కిరణ్ కుమార్ రెడ్డి..
అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్ సభ స్థానం నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ప్రచారం కోసం ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రాజంపేటకు వచ్చారు. భారీగా వచ్చిన జనసందోహాన్ని చూసి సంతోషించిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రజాధరణ రేపటి తమ గెలుపుకి సూచన అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు తన తండ్రికి రాజకీయాలలో సమకాలీకుడని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవితో అతను ఎన్నో సభలలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ ఇద్దరితో కలిసి ఇలా మొదటిసారి వేదిక పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. ప్రజలు ఎప్పుడు చూపిస్తున్న ఉత్సాహాన్ని కొనసాగిస్తూ మే 13న జరగబోయే పోలింగ్ లో తమను గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తాను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాను అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇటువంటి దరిద్రమైన పాలన ఎప్పుడూ చూడలేదు అని అన్నారు. పేదల పట్ల వ్యతిరేకంగా ఉన్న ఈ ప్రభుత్వం అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మరుసటి నిమిషం పెట్టే మొదటి సంతకం డీఎస్సీ ఫైల్ మీదే అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు.