భూ బకాసురలను భయపెట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. సజ్జల రామకృష్ణారెడ్డి..
ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పలు రకాల డిబేట్లకు దారితీస్తోంది. అసలు దీని గురించి ఎవరికీ పూర్తి క్లారిటీ లేకపోయినప్పటికీ ఏదో ఒక రకంగా ప్రజలలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ విషయంపై ఎన్నికలలో గెలవడం ధ్యేయంగా పెట్టుకున్న ప్రతిపక్షాలు అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాయి. దీంతో ఈ విషయంపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో సమావేశం నిర్వహించి..స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేవలం భూ కబ్జాలు చేయాలి అనుకునే వారికి ఎటువంటి యాక్ట్ రావడం ఇష్టం ఉండదని.. అందుకే అలాంటివారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది భూములను వక్షించే భూ బకాసురుల నుంచి ప్రజల భూములను రక్షించే చట్టమని ఆయన పేర్కొన్నారు.
ఇంకెవరైనా ఇలా అజ్ఞానంగా మాట్లాడితే పర్వాలేదు.. ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు లాంటి వ్యక్తి కూడా ఇలాంటి విషయంలో ఇలా మాట్లాడడం తనని ఆశ్చర్యానికి గురిచేసింది అని అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ సజ్జల.. ”మీరు ఎలాగో ఇలాంటి చట్టాలు తీసుకురాలేరు.. ప్రజల మంచి కోసం పాటుపడుతున్న జగన్లాంటి వ్యక్తి ఇలాంటివి తీసుకువస్తే హర్షించలేరు.. మీ విషపూరితమైన ఆలోచనలు.. పచ్చ మీడియా.. చేస్తున్న చెడు ప్రచారాల వల్ల ప్రజలు అయోమయం చెందుతున్నారు..” అని ధ్వజమెత్తారు. ఇంకా రూపకల్పన దశలోనే ఉన్న ఒక యాక్ట్ గురించి ఇంత గొడవ చేయాల్సిన అవసరం ఏముంది.. అసలు దాని గురించి పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా మాట్లాడడం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.