జిల్లాల జోలికి వెళ్తే.. ప్రజా ఉద్యమం తప్పదు.. కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జనజాతర సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన కేటీఆర్ గత నాలుగున్నర నెలల్లో రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడడం తప్ప చేసింది ఏమీ లేదు అని ఎద్దేవా చేశారు. పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్లుగా తెలంగాణ ప్రస్తుత పాలన మారింది అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన పనులకు వ్యతిరేకంగా చేయడం మాత్రమే రేవంత్ రెడ్డికి తెలుసు అని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. అంతేకాదు జిల్లాలకు సంబంధించిన పూనర్విభజనపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలను తెలుసుకున్న తాము తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశామని.. ఇప్పుడు ఆ జిల్లాలను కుదించడం కోసం రేవంత్ సర్కార్ తీవ్రంగా కుట్ర పన్నుతోందని ఆయన మండిపడ్డారు. కొత్త జిల్లాలను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించాల్సిందే అని ఆయన గట్టిగా వాదించారు. జిల్లాలను రద్దు చేయడానికి ఏమాత్రం ప్రయత్నించినా ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.