తెలుగు సినిమాలపై బాలీవుడ్ బాక్సాఫీస్ ఆశలు
ఈ ఏడాదిలో బాలీవుడ్ పై పెట్టుకున్న ఆశలన్నీ ఆయా సినిమాలు నిరాశ పరుస్తూ వస్తున్నాయి. సమ్మర్ లో బాక్సాఫీస్ కళకళలాడుతుందనుకుంటే బడేమియా చోటేమియా, మైదాన్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మరోవైపు వేరే బాలీవుడ్ స్టార్స్ నుంచి కొత్త సినిమాల మీద కూడా బాలీవుడ్ కు పెద్దగా ఆశలు లేవు. షారుఖ్ నుంచి ఈ సంవత్సరం కొత్త సినిమా వచ్చేలా లేదు.
సల్మాన్, ఆమీర్ ఖాన్ సినిమాలు కూడా ఈ ఏడాది రిలీజయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇక మిగిలిన స్టార్ల మీద ఆశలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బాక్సాఫీస్ ఆశలన్నీ సౌత్ సినిమాల మీదే ఉన్నాయి. ఈ ఇయర్ సెకండాఫ్ లో వచ్చే సౌత్ సినిమాలే నార్త్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయని అక్కడి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆశ పడుతున్నారు.
వాటిలో ముందుగా వచ్చేది ప్రభాస్ కల్కి సినిమా. ఈ సినిమా జూన్ నెలాఖరులో రిలీజ్ అవుతుందంటున్నారు. నార్త్ లో టాప్ బాలీవుడ్ స్టార్ల సినిమాల స్థాయిలో కల్కి రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఆగస్ట్ లో రిలీజ్ కానున్న పుష్ప2 పై ఏ రేంజ్ లో అంచనాలున్నాయో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ దేవర, సూర్య కంగువ, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి సౌత్ సినిమాలైనా బాలీవుడ్ బాక్సాఫీస్ ఆశలను నిలబెడతాయో లేదో చూడాలి.