ప్రజాస్వామ్యసౌధం - భద్రతాలోపాలు..
దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటులో బుధవారం ఆగంతకులు కలకలం రేపారు.గ్యాస్ క్యానిస్టర్లు ద్వారా పొగ వదిలి భయాందోళనలు సృష్టించారు. అయితే ఈఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఈఘటన.. పార్లమెంటు దగ్గర భద్రతా లోపాలను బట్టబయలు చేసింది. శత్రుదుర్భేద్యం అనుకున్న ఢిల్లీలో ఇలా జరగడం, అందునా.. అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లుండే పార్లమెంటులో ఆగంతుకులు అలజడి రేపడంతో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఆరుగురు నిందితులు... అంత ఈజీగా ఎలా పార్లమెంటులోకి వెళ్లగలిగారు. సరే వారు మైసూరు ఎంపీ పాసులతో లోపలకి వెళ్లారు ఓకే.. వారితో పాటు గ్యాస్ క్యానిస్టర్లను ఎలా తీసుకెళ్లగలిగారు. ఇవాళ రేపు.. షాపింగ్ మాల్స్ కు వెళ్తేనే.. అక్కడ తనిఖీ చేసే మెషీన్లు , మనదగ్గర ఉన్న వస్తువులను కనిపెట్టేస్తాయి. మరి గ్యాస్ క్యానిస్టర్లను తీసుకెళ్తే .. తనిఖీ వ్యవస్థ ఎందుకు గుర్తించలేకపోయింది. ఇదే ఉగ్రవాదులు ఇలాగే ప్రయత్నిస్తే.. పరిస్థితి ఏంటి..? ఇప్పుడిదే అంశంపై దృష్టి సారించారు పార్టీల ఎంపీలు,విశ్లేషకులు, భద్రతా నిపుణులు.
పక్కా ప్రణాళికతోనే..
సాగర్ శర్మ, మనోరంజన్, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్ అనే ఆరుగురు దుండగులు పక్కా ప్రణాళిక ప్రకారం.. పూర్తి సమన్వయంతో పార్లమెంటు వద్ద తాజా దుస్సాహసాలకు ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు. ఈ ఆరుగురు నిందితులకు నాలుగేళ్లుగా ఒకరితో ఒకరికి పరిచయం ఉంది. పార్లమెంటులో చొరబాటుకు వారు కొన్ని రోజుల క్రితమే ప్రణాళిక రచించారు. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో సంప్రదింపులు జరిపారు. ఓసారి రెక్కీ కూడా నిర్వహించారు. సాగర్ శర్మ, మనోరంజన్, నీలమ్, అమోల్ శిందె మంగళవారం రాత్రి గురుగ్రామ్కు చెందిన విశాల్ ఇంట్లో ఉన్నారు. ప్రస్తుతం సాగర్, మనోరంజన్, నీలమ్, అమోల్లను పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మణిపుర్ సంక్షోభం, రైతుల నిరసనలు, నిరుద్యోగిత వంటి అంశాలతో తాము తీవ్ర నిరాశకు గురయ్యామని.. అందుకే తాజా ఘటనలకు పాల్పడ్డామని విచారణలో పోలీసులకు అమోల్ తెలిపాడు. విశాల్నూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లలిత్ కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు- దిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోడా పార్లమెంటును సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
భద్రతపై సిఫార్సులు చేయనున్న కమిటీ
పార్లమెంటు వద్ద తాజా ఘటనలపై దర్యాప్తు చేయడంతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన మెరుగైన భద్రతా చర్యలను సిఫార్సు చేసేందుకు లోక్సభ సచివాలయం వినతి మేరకు కేంద్ర హోం శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. దానికి సీఆర్పీఎఫ్ డీజీ నేతృత్వం వహిస్తారు. కమిటీలో ఇతర భద్రతా సంస్థల అధికారులు, నిపుణులు సభ్యులుగా ఉంటారని హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. వీలైనంత త్వరగా వారు నివేదిక సమర్పిస్తారని తెలిపారు.