థరూర్ నా తమ్ముడి వంటి వాడు : మల్లికార్జున్ ఖర్గే
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పోటీదారు శశిథరూర్ తనకు తమ్ముడి వంటి వాడని ఖర్గే అన్నారు. అధ్యక్షుడి రేసులో మల్లికార్జున్ ఖర్గే, శిశథరూర్ మధ్యే పోటీ నెలకొంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్ పేర్లు కూడా వినిపించినప్పటికీ.. చివరకు ఖర్గే, థరూర్ మాత్రమే ముఖాముఖీ తలపడుతున్నారు. ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు శశిథరూర్ను పోటీ నుంచి తప్పుకోవాలని అడుగుతారా? అని ఖర్గేను ప్రశ్నించగా ఆయన స్పందించారు. పోటీ నుంచి తప్పుకోవాలని థరూర్ ను తాను ఒత్తిడి చేయడం జరగదని స్పష్టం చేశారు. ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ఎన్నుకోవడం మంచిదని గతంలో తాను సూచించానని, అయితే ప్రజాస్వామ్యంలో పోటీ ఉంటేనే మంచిదని ఖర్గే అన్నారు. శశిథరూర్ కూడా తన తమ్ముడి వంటి వాడని తెలిపారు. పార్టీని పటిష్టం చేసేందుకే తాను అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగినట్టు పేర్కొన్నారు.