దేశం చూపు.. ఏ పార్టీ వైపు...!
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ జరిగినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న ఈఎన్నికల్లో గెలిచి, ఢిల్లీ కుర్చీని పట్టేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునిప్రచారం చేసింది. మరోవైపు ఈ ఎన్నికల్లో సత్తా చాటితే, సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావొచ్చన్నది మోడీ సర్కార్ ఉద్దేశ్యంగా ఉంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కు ఛాన్సివ్వకూడదని బీజేపీ ప్రయత్నించింది. దీంతో ఇరు పార్టీలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించాయని చెప్పక తప్పదు.
పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. అందులో ముఖ్యంగా తెలంగాణ , చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో హస్తానికి ప్రజలు పట్టం కట్టారని చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికల విషయానికొస్తే మాత్రం కొన్ని కమలానికి ఓటేయగా.. మరికొన్ని హస్తం వైపు చూస్తున్నాయి. మిజోరాంలో మాత్రం ‘జొరాం పీపుల్స్ మూవ్మెంట్’ (జడ్పీఎం), ‘మిజో నేషనల్ ఫ్రంట్’ (ఎంఎన్ఎఫ్) మధ్య నువ్వా-నేనా అనే వాతావరణం నెలకొందని, ఆ తర్వాతి స్థానాల్లోనే కాంగ్రెస్, బీజేపీలు నిలుస్తాయని అంచనాలు చెబుతున్నాయి.
తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేకత అధికంగా ఉండడం, అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లివ్వడం.. కాంగ్రెస్ నాయకులు ఏకతాటిపైకి వచ్చి ఎన్నికల్లో పోారాడడం... హస్తానికి కలిసివచ్చినట్లు చెబుతున్నారు. ఇక చత్తీస్ గఢ్ లో సీఎం భగేల్ సంక్షేమపాలనకు ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైందని.. మధ్యప్రదేశ్ లో మామకు మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశముందంటున్నాయి సర్వేలు.
అయితే మరికొన్ని మాత్రం హోరాహోరీ తప్పదంటున్నాయి. సార్వత్రిక సమరానికి ముందు జరిగిన ఎన్నికలు కావడంతో వాస్తవ ఫలితాల కోసం అన్ని వర్గాలూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లు కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, మిజోరంలో ఎంఎన్ఎఫ్ అధికారంలో ఉంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.