డీఎస్పీ వర్సెస్ తమన్ విన్నర్ ఎవరో?
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్ అగ్ర కథనాయకులు మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి బాక్సాఫీస్ ముందు పోటీపడుతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో పందెం కోళ్లలా సమరానికి కాలు దువ్వుతుండడంతో ఈ సినిమాలపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోల నుంచే ఈ రెండు సినిమాల మధ్య పోటీ మొదలైంది.
బాబీ తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య లిరికల్స్ తో ప్రమోషన్స్లో జోరు పెంచింది. ఇప్పటికే రిలీజైన ఐటమ్ సాంగ్ బాస్ పార్టీ పేరుతో ఇన్స్టాంట్ చార్ట్బస్టర్గా నిలిచింది. ఇందులో బాలీవుడ్ భామ ఊర్వశీ స్టెప్పులు, డీఎస్పీ మాస్ బీట్స్ ప్రేక్షకులకు బాగా ఎక్కేశాయి. ఇక ఈ పాటతో మరోసారి వింటేజ్ చిరూని చూసినట్లే అనిపించింది.
ఈ నేపథ్యంలో బాస్ పార్టీకి పోటీగా వీరసింహా రెడ్డి నుంచి మా బావ మనోభావాలు అనే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో చంద్రికా రవి అనే మలయాళ నటి అందాలు ఆరబోసి బాలయ్య పక్క స్టెప్పులేసింది. చాలా రోజుల తర్వాత బాలయ్యపై స్పెషల్ సాంగ్ని తెరకెక్కించడంతో బాలయ్య ఎంతో ఎనర్జిటిక్గా ఈ సాంగ్లో స్టెప్పులేసి ఫ్యాన్స్ను ఉర్రూతలూగించారు. ఈ పాట బాస్ పార్టీ సాంగ్కు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే ఇప్పటికే జై బాలయ్య అంటూ సాగే పాటతో థమన్ మంచి మార్కులే కొట్టేశాడు. మరి వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ దీనికి పోటీ ఇస్తుందా? మొత్తం మీద థమన్, దేవీ శ్రీ లలో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది తెలియాలంటే పండగ వరకు ఆగాల్సిందే.