అంబేడ్కరే తిరిగొచ్చి అడిగినా అసాధ్యం: పీఎం మోదీ
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తీసేస్తుందని ప్రజలకు ఇంకెంతకాలం అబద్ధాలు చెబుతారంటూ విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బీజేపీపై ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజలకు ఎవరిని ఎన్నుకోవాలో తెలుసని వ్యాఖ్యానించారు. ఛత్తీస్గడ్లో జూంజ్ గిర్-చంపాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో.. పాల్గొన్న ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు తమకు తాము శ్రీరాముని కంటే గొప్పవాళ్ళనుకుంటున్నారని, అందుకే అయోధ్య ప్రాణప్రతిష్టకు కూడా ఆ పార్టీ నుంచి ఎవ్వరూ రాలేదని విమర్శించారు.
అలాగే బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లను తొలగించేస్తుందని విపక్షాలు చెబుతుండడంపై కూడా ఘాటుగా స్పందించారు.‘‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇంకెన్ని రోజులు ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తారు..? బీజేపీయే కాదు.. ఎవ్వరూ రాజ్యాంగాన్ని మార్చలేరు. ఏకంగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సైతం తిరిగొచ్చి అడిగినా రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదు’’ అంటూ ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.