తారకరత్న మరణంతో వాయిదా పడ్డ షూటింగ్లు
నందమూరి తారకరత్న మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గత నెల 26న గుండెపోటుతో హాస్పిటల్లో చేరిన తారకరత్న 23 రోజుల తర్వాత మరణించారు. నేటితో తారకరత్న ప్రయాణం ముగిసింది. ఈ పరిణామం ఇప్పుడు నందమూరి హీరోల సినిమాలపై పడింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 23 నుంచి ప్లాన్ చేసింది చిత్ర బృందం. దానికి సంబంధించిన వర్క్, ఆర్టిస్టుల డేట్లు అన్నీ రెడీ చేసుకుని సిద్ధంగా ఉంది NBK108 టీమ్. కానీ ఈ లోగా తారకరత్న అనంత లోకాలకు వెళ్లిపోయాడు.
బాలయ్యతో ఎంతో క్లోజ్గా ఉండే తారకరత్న మరణాన్ని బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నాడు. తండ్రి కంటే ఎక్కువ తనతోనే చనువుగా ఉంటే తారకరత్న ఇలా అనుకోకుండా వెళ్లిపోవడంతో బాలయ్య ఎలా ఉన్నాడో, తను ఎలాంటి బాధను అనుభవిస్తున్నాడో అందరూ టీవీల్లో చూశారు. ఇలాంటి సమయంలో బాలయ్య మునుపటిలా ఎనర్జీతో నటించడం అంత ఈజీ కాదు. కోలుకోవడానికి మినిమం టైమ్ కావాలని ఆలోచించి NBK108 టీమ్ కొత్త షెడ్యూల్ను వాయిదా వేసింది.
ఇక ఎన్టీఆర్, కొరటాలతో చేస్తున్న తన 30వ సినిమా ఈ నెల 24న పూజా కార్యక్రమాలతో లాంఛ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇలాంటి విపత్తులో తారక్ సైతం షూటింగ్ వైపు మొగ్గు చూపకపోవడంతో ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. గత ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడినప్పటికీ వేరే మార్గం లేకపోవడంతో ఎన్టీఆర్30 ముహూర్తాన్ని వాయిదా వేసి, మరో కొత్త డేట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు.