రాజ్యాంగాన్ని కాదు.. కేసీఆర్ ను మార్చాలి : లక్ష్మణ్
తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి రగిలించే ప్రయత్నం చేస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తన పేరును తారక రామారావుకు బదులుగా తుపాకీరావుగా మార్చుకోవాలని అన్నారు. నైరాశ్యంతోనే ప్రధాని మోదీపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని చురకలంటించారు. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లు, కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని వెల్లడించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నమ్మించి మోసం చేసిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. 57 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఎప్పుడిస్తారో మంత్రి కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ సైన్యాన్ని కించపరిచే విధంగా చైనాకు అనుకూలంగా కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రాజ్యాంగాన్ని కాకుండా కేసీఆర్ను మార్చాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించారని అన్నారు.