ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమైన కూటమి!! ఇకపై పోరు ఉధృతం..!!
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఓడించి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో టీడీపీ, జనసేన, బీజేపీ ఏకతాటిపైకి వచ్చాయి. అయితే ఆ మూడు పార్టీల మధ్య ఇప్పటికీ సఖ్యత కనిపించట్లేదు. సీట్ల సర్దుబాటు కూడా పూర్తి కాలేదు. అభ్యర్థులను ప్రకటించిన చోట్ల గందరగోళం నెలకొంది. కొన్నిచోట్ల అసంతృప్తులు భగ్గుమంటుంటున్నారు. మరికొన్ని చోట్ల రెబెల్స్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వీళ్లందరినీ దారికి తెచ్చుకోకపోతే పరిస్థితి మొదటికే మోసం వస్తుందనే భయం కూటమిలో కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టాయి. అనేక చర్చల అనంతరం టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లోనూ జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లోనూ, బీజేపీ 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాల్లోనూ పోటీ చేసేలా ఒక అవగాహనకు వచ్చాయి. ఏఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనేదానిపై కూడా క్లారిటీకి వచ్చాయి. అభ్యర్థులను కూడా ప్రకటించాయి. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. సీట్లు దక్కని కీలక నేతలు భగ్గుమన్నారు. మరికొందరు పార్టీ వీడి వైసీపీలో చేరిపోతున్నారు. ఇంకొందరు రెబెల్స్ గా పోటీ చేసి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం మూడు పార్టీలూ ప్రచారంలో బిజీ అయ్యాయి. అయితే నేతలు ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడ ఎదురవుతున్న అసంతృప్తిని చల్లార్చడం నేతలకు తలకు మించిన భారంగా మారుతోంది. అందుకే సీట్ల సర్దుబాటుపై పునరాలోచించుకోవాలని మూడు పార్టీలూ నిశ్చయించుకున్నాయి. అందులో భాగంగా శుక్రవారం చంద్రబాబు నివాసంలో జనసేన, బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్, పురంధేశ్వరి, సిద్ధార్థ్ సింగ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అసంతృప్తులు, పరస్పర సహకారం లాంటి అనేక అంశాలపై వాళ్లు చర్చలు జరిపారు. అవసరమైతే ఒకటి రెండు స్థానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించారు.
మరోవైపు.. అసంతృప్తులను బుజ్జగించి పూర్తిగా పరస్పరం సహకరించుకునేలా చర్యలు తీసుకోవాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. బలమైన అభ్యర్థులు ఉన్న చోట్ల అవసరమైతే వాళ్లకు సీటు ఇవ్వడం ద్వారా ఇచ్చిపుచ్చుకోవాలని వారు భావిస్తున్నారు. అసంతృప్తులను దారికి తెచ్చుకోకపోతే రెబెల్స్ బెడద తప్పదని.. అదే జరిగితే మొదటికే మోసం వస్తుందని అంచనాకు వచ్చారు. అందుకే అసంతృప్తులను బుజ్జగించడం, వాళ్ల ఒత్తిడి మేరకు ఒకటి, రెండు చోట్ల సీట్లు సర్దుబాటు చేయడం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే ప్రచారంలో స్పీడ్ పెంచాలని, మూడు పార్టీల నేతలూ ఉమ్మడిగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.