వామ్మో! ఒకే బ్యానర్లో 30 సినిమాలా
ఒక ప్రొడక్షన్ హౌస్ 30 సినిమాలు పూర్తి చేస్తేనే ఆశ్చర్యపోతున్న రోజుల్లో, 30 సినిమాలు ఒకే సంస్థ నుంచి ప్లానింగ్ లో ఉన్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు. మొదట్లో ఏదో కసిగా సినిమాలు తీసి, ఆ తర్వాత కనుమరుగవుతున్న ప్రొడక్షన్ హౌస్లు చాలానే కనిపిస్తాయి. సినిమా నిర్మాణమనేది జూదంలా మారిపోయిన ఈ రోజుల్లో నిలకడగా సక్సెస్లు అందుకుని, దీర్ఘకాలం నిలిచే సంస్థలు చాలా తగ్గిపోతున్నాయి.
కాంబినేషనల్ మీద ఆధారపడి సినిమాలు తెరకెక్కుతున్న ఈ రోజుల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో దాదాపు 30 సినిమాల వరకు ప్లానింగ్లో ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలొస్తున్నాయి. మొదట్లో కాస్త నెమ్మదిగా అడుగులేసిన ఈ బ్యానర్, చిన్న సినిమాలను మాత్రమే నిర్మించింది. వాటి ఫలితాలు కూడా ఆ రేంజ్లోనే వచ్చాయి.
కానీ పోయిన సంవత్సరం కార్తికేయ2తో పాన్ ఇండియన్ హిట్ అందుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు, కొన్ని నెలలకే ధమాకా రూపంలో మరో హిట్ తగిలింది. దీంతో ఈ బ్యానర్ దూకుడు పెంచింది. ఇప్పుడు ఇద్దరు టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ, తమ బ్యానర్ ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లే పనిలో బిజీగా ఉంది.
మారుతి-ప్రభాస్ సినిమాతో పాటూ, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలయికలో వస్తున్న వినోదాయ సీతం రీమేక్ ను నిర్మిస్తుంది కూడా ఈ బ్యానరే. రానున్న మే మొదటి వారంలో రిలీజ్ కానున్న రామబాణం ఈ బ్యానర్ నుంచి వస్తున్న సినిమానే. ఇవి కాకుండా అనౌన్స్ చేయకుండానే సైలెంట్ గా సెట్స్పైకి వెళ్లినవి కొన్నైతే, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నవి మరికొన్ని, కథా చర్చల్లో ఉన్నవి ఇంకొన్ని. ఇలా ఈ బ్యానర్లో లైన్లో చాలానే సినిమాలున్నాయట. ఒకే టైమ్ లో ఒక బ్యానర్ నుంచి ఇన్ని సినిమాలంటే రికార్డనే చెప్పాలి.