Bangladesh: బంగ్లాదేశ్ లో రాడికలిజం.. భారత హైకమిషన్ పై దాడి యత్నం..!
బంగ్లాదేశ్ లో రాడికలిజం బుసలు కొడుతోంది. ముఖ్యంగా భారత వ్యతిరేక వైఖరితో ఊగిపోతోంది. అతివాదశక్తులకు తోడు ఉగ్రనాగులు జతకలవడంతో.. ఎంతకైనా తెగించే స్థితికి చేరింది పరిస్థితి. దీనిలో భాగంగా…బంగ్లాదేశ్లో రాడికల్ గ్రూపులు ఢాకాలోని భారత హైకమిషన్పై దాడికి యత్నింయి.గుంపుగా వచ్చిన నిరసనకారులు బారికేడ్లను దాటుకుని రాయబార కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వీసాల జారీ ప్రక్రియ నిలిపివేతను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఎంబసీని ముట్టడించారు.
కొన్ని రోజులుగా భారత రాయబార కార్యాలయానికి ఆ దేశంలోని పలువురు నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని బంగ్లా రాయబారి రియాజ్ హబీబుల్లాను భారత విదేశాంగ శాఖ పిలిపించి, పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం బెదిరింపులు వస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఉగ్రవాదుల బెదిరింపులు, బంగ్లాదేశ్ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం బంగ్లా రాజధాని ఢాకాలో ఉన్న ఇండియన్ వీసా దరఖాస్తు కేంద్రాన్ని (IVAC) మూసివేసింది. భద్రతా పరిస్థితిని చూపిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుంచి కార్యకలాపాలను నిలిపేసింది. బుధవారం షెడ్యూల్ అయిన అన్ని అపాయింట్మెంట్లను తర్వాత తేదీకి తిరిగి షెడ్యూల్ చేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.
అంతకుముందు, బంగ్లాదేశ్ రాజకీయ నాయకుడు, నేషనల్ సిటిజన్ పార్టీ నేత హస్నత్ అబ్దుల్లా భారత్ను రెచ్చగొట్టే ప్రకటన చేశారు. తమ దేశాన్ని అస్థిరపరిస్తే భారత్ దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ఒంటరి చేస్తామని హెచ్చరించారు. ప్రతిఘటన అగ్ని సరిహద్దుల్ని దాటుతుందని హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు.






