Digital Arrests: ‘డిజిటల్ అరెస్ట్’లపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
దేశవ్యాప్తంగా ఇటీవల డిజిటల్ అరెస్టులు (Digital Arrests) పెరిగిపోయాయి. పౌరుల ఆర్థిక భద్రతను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు (supreme court) తీవ్రంగా స్పందించింది. నకిలీ పోలీసులు, న్యాయాధికారులమంటూ నకిలీ కోర్టు పత్రాలతో అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఈ తరహా మోసాలపై దాఖలైన కేసును ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది. ఈ తరహా మోసాల నియంత్రణ, దర్యాప్తులో దేశవ్యాప్తంగా సారూప్యత ఉండేలా చూసేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో నమోదైన డిజిటల్ అరెస్ట్ సంబంధిత ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని ఆదేశించింది.
విచారణ సందర్భంగా డిజిటల్ అరెస్ట్ మోసాల తీవ్రతను పరిశీలించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ డిజిటల్ అరెస్ట్ మోసాలు కేవలం దేశంలోనే కాకుండా, దేశ సరిహద్దులు దాటి కూడా జరుగుతున్నాయని అభిప్రాయపడింది. ఇది దేశవ్యాప్త కుంభకోణం కావడంతో, ఈ కేసుల సమగ్ర దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సూచించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఇలాంటి అనేక కేసులను సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోందని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ విభాగం అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తోందని కోర్టుకు తెలిపారు. అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఈ మోసాల వెనుక ఉన్న అంతర్జాతీయ లింకులను వివరించారు. ఈ మోసాల వెనుక ఉన్న మనీలాండరింగ్ ముఠాలు భారత్ బయట నుంచి, ముఖ్యంగా మయన్మార్, థాయ్లాండ్ వంటి దేశాల నుంచి పనిచేస్తున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
విచారణ సందర్భంగా, హర్యానా ప్రభుత్వం తరఫు న్యాయవాది హాజరయ్యారు. అంబాలా సైబర్ క్రైమ్ బ్రాంచ్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. ఈ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేశారు. సంబంధిత ఇతర ఎఫ్ఐఆర్ల వివరాలు సమర్పించేందుకు వారం రోజుల సమయం కోరగా, ధర్మాసనం దానికి అనుమతి ఇచ్చింది.
ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలో నమోదైన డిజిటల్ అరెస్ట్ సంబంధిత ఎఫ్ఐఆర్ల వివరాలను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, ప్రస్తుతానికి అధికారికంగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాల్సిన అవసరం లేదని, కేవలం కేసుల వివరాలను రికార్డుల రూపంలో అందించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ నివేదికలు సమర్పించిన తర్వాతే ఈ కేసుపై తదుపరి విచారణ జరగనుంది.








