మూడోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన మహువా మొయిత్రా
తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. కేష్ ఫర్ క్వేరీ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహువా మొయిత్రా ఈడీ ముందు హాజరు కావడానికి మాత్రం సుముఖత చూపించడం లేదు. ఇప్పటికే ఈ కేసులో రెండు సార్లు ఈడీ నుంచి సమన్లు అందినప్పటికీ మహువా మొయిత్రా మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఇక తాజాగా ఈడీ 3వ సారి సమన్లు జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో విచారించాల్సి ఉందని, వెంటనే ఏజెన్సీ ముందు హాజరుకావాలని కోరింది.
కాగా.. ఈడీ మూడోసారి జారీ చేసిన సమన్ల ప్రకారం మొయిత్రా గురువారం విచారణకు హాజరుకావల్సి ఉంది. అయితే ఆమె మాత్రం విచారణకు హాజరుకాకపోగా.. లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకూ తనను విచారణకు పిలవొద్దని ఈడీ అధికారులను కోరినట్లు తెలిస్తోంది. ప్రస్తుతం కృష్ణానగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న మొయిత్రా.. ప్రస్తుతం ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే వరుసగా ఈడీ సమన్ల నుంచి తప్పించుకుంటున్న మొయిత్రాపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది యాంటీ కరప్షన్ అంబుడ్స్మన్ లోక్పాల్. 6 నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ శనివారం ఆమె నివాసాల్లో, కార్యాలయాల్లో సోదాలు కూడా జరిపింది. ఇంతలోనే ఈడీ ఆమెకు బుధవారం మూడోసారి సమన్లు పంపింది. గురువారం విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానికి కూడా సమన్లు పంపింది