బాబుకు ఓటు వేస్తే.. పథకాలు మూట కట్టినట్టే..జగన్
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత తొలిసారిగా బహిరంగ సభలో పాల్గొన్న సీఎం.. ప్రత్యర్థులపై మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఈసారి ఆయన ప్రసంగం మరింత పదునుగా వినిపిస్తోంది. పొరపాటున కూడా ప్రజలు చంద్రబాబు ఉచ్చులో పడకూడదని.. ఒకవేళ అదే జరిగితే ఇక పథకాలు కథ కంచికి వెళుతుందని ఆయన అన్నారు. బాబుకు ఓటు వేయడం పథకాలకు ముగింపు పలకడంతో సమానమని తాడిపత్రి సభలో జగన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో 99% పనులు అమలు చేసిందని.. చేయలేని పనులు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం తనకు చేతకాదని జగన్ పేర్కొన్నారు. ఐదేళ్లలో బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి నేరుగా 2.7 లక్షల కోట్ల నిధులు జమ చేశామని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో 2.3 లక్షల ఉద్యోగాలు సమకూర్చామని పేర్కొన్నారు. ఈ ఐదేళ్ల భవిష్యత్తును నమ్మి తనకు ఓటు వేయాల్సిందిగా ప్రజలను కోరారు. ఐదేళ్ల పాలనలో ఇంత చేసిన ఈ ప్రభుత్వం మరొక 15, 20 సంవత్సరాలు ఉంటే రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందో ఆలోచించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.