నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్న ధోనీ?
టీమిండియా మాజీ కెప్టెన్, కెప్టెన్ కూల్, ప్రస్తుత ఐపీఎల్ ట్రెండ్ సెట్టర్ ఎం.ఎస్ ధోనీ గురించి ఇప్పుడు కొత్త వార్త నెట్టింట తెగ ప్రచారమవుతుంది. ఇన్నాళ్లు మైదానంలో ఆటగాడిగా కనిపించన ధోనీ త్వరలోనే వెండితెరపై కనిపించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ధోనీ నటనారంగ ప్రవేశం గురించి ఇప్పుడు చర్చ సాగుతోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న గోట్ సినిమాతో ధోనీ అరంగేట్రం ఉంటుందని సమాచారం. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేయనుండగా, ఇందులో భారీ తారాగణం నటించనుంది. ఇప్పటికే పలు లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల్లో ధోనీ కూడా పాల్గొన్నట్లు వార్తలు వినిపించాయి.
దీంతో ఈ సినిమాలో ధోనీ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని అందరూ అంటున్నారు. కానీ దీనిపై ధోనీ టీమ్ కానీ, గోట్ చిత్ర బృందం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇన్నాళ్లూ స్టేడియంలో బ్యాట్ పట్టుకున్న ధోనీ ఇకపై నటుడిగా కూడా అలరిస్తాడని ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరి అందరూ అనుకుంటున్నట్లు ధోనీ వెండితెర అరంగేట్రం చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.