కాంగ్రెస్లో ఉండడమే రేవంత్ తప్పు: ఎంపీ అర్వింద్
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు సంభవించబోతున్నాయని, పొలిటికల్ పరిణామాలు మారబోతున్నాయని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో తమ పార్టీ దినదినాభివృద్ధి సాధిస్తోందని, అంతకంతకూ బలంగా తయారవుతోందని అన్నారు. నిజామాబాద్ నగరంలో మంగళవారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించిన సందర్భంగా అర్వింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి ఏ పార్టీతో లాలూచీ పడాల్సిన అవసరం లేదని ధీమా వ్యక్తం చేసిన అర్వింద్.. ఈ లోక్సభ ఎన్నికల్లో తమ బీజేపీకి 12 సీట్లు వస్తాయని, ఈ మాట కాంగ్రెస్ పార్టీ నేతలే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక అదే నిజమైతే రేవంత్ను ఆ దేవుడు కూడా కాపాడలేడని ఎద్దేవా చేశారు. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అధ్వాన్నంగా ఉందన్న ఎంపీ అర్వింద్.. వందరోజులైనా అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెబుతుండడం మరోసారి ప్రజలను మోసం చేయడమేనని, ఆ పార్టీ ఓటర్లును వెన్నుపోటు పొడుస్తోందని మండిపడ్డారు.
ఇక కవిత అరెస్ట్పై స్పందించిన అర్వింద్.. అవినీతి చేసిన వారికి శిక్ష తప్పదని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి లేదన్నారు. ‘‘ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీలు నెల రోజుల్లో పనిచేసే ప్రక్రియను ప్రారంభిస్తాం. నిజామాబాదు పార్లమెంటు పరిధిలో ఆధ్యాత్మిక, టూరిజం కారిడార్ను ఏర్పాటు చేస్తాం. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని మోడీ ప్రభుత్వం నెరవేర్చుతుంది. మోదీ మూడో టర్మ్లో కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తాం’’ అంటూ బీజేపీ ఎన్నికల హామీలను ప్రజలకు అర్వింద్ వివరించారు. చివరిగా సీఎం రేవంత్ రెడ్డి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అర్వింద్.. ముఖ్యమంత్రిగా రేవంత్ సమర్ధుడే కానీ, కాంగ్రెస్లో ఉండటమే ఆయన చేసిన పెద్ద తప్పని, ఆ పార్టీ నేతలు ఆయనను పనిచేయనివ్వడంలేదని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.