ఇది పేదలకు పెత్తందారులకు మధ్య కురుక్షేత్రం.. జగన్
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నాయకులు ప్రత్యర్ధుల పై మాటల తూటాలు పేలుస్తున్నారు. నిన్నటి వరకు చాలా సైలెంట్ గా ఉన్న జగన్ కూడా మేమంతా సిద్ధం సభలో ప్రతిపక్షాలను ఏకీపారేస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ఆయన ఉద్వేగ భరితంగా మాట్లాడారు. మే 13న జరగబోయేది కేవలం ఎన్నికలు మాత్రమే కాదని.. మంచికి చెడుకి మధ్య కురుక్షేత్రం అని అన్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగేయి యుద్ధంలో.. పేదలందరూ ఒకవైపు ఉంటే పెత్తందారులు మరోవైపు ఉన్నారు అని పేర్కొన్నారు. కూటమి పేరుతో కుట్రలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూసే మోసగాళ్లను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. పొత్తులు, జిత్తులు తనకు తెలియవని.. కుట్రలు, కుతంత్రాలకు పేదలు బలికాకుండా అండగా నిలబడడానికి తాను ఎప్పుడు సిద్ధమని జగన్ అన్నారు. రానున్న ఎన్నికలలో పేదల వ్యతిరేకులను ఓడించి.. గెలిచేది తమ పార్టీ అని.. ప్రజల అండ తమకు ఉన్నప్పుడు ఎవరి కుట్రా తమ మీద పనిచేయదని జగన్ ధీమా వ్యక్తం చేశారు.