చరణ్ ఫ్యాన్స్ కు దిల్ రాజు గుడ్ న్యూస్
గేమ్ ఛేంజర్ సినిమా మొదలై మూడేళ్లవుతున్నా ఇప్పటికీ రిలీజ్ గురించి స్పష్టత రాలేదు. ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. దీనికి కారణం డైరెక్టర్ శంకర్ అయినప్పటికీ ఫ్యాన్స్ నుంచి ఎప్పటికప్పుడు వ్యతిరేకత ఎదుర్కొంటుంది మాత్రం నిర్మాత దిల్ రాజే. చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు హాజరైన దిల్ రాజు ఫ్యాన్స్ కు మంచి శుభవార్తలు చెప్పాడు.
ఇంకో నాలుగైదు నెలలు ఓపిక పడితే చరణ్ చేసిన పాన్ ఇండియా సినిమాను చూసుకోవచ్చని గుడ్ న్యూస్ చెప్పాడు. రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇవ్వకపోయినా ఇన్ సైడ్ టాక్ ప్రకారం, అక్టోబర్ 31 ని లాక్ చేసుకున్నారని అంటున్నారు. దీనికి శంకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందట. జరగండి సాంగ్ ముందుగానే లీకవడం వల్ల అనుకున్నంత కిక్ ఇవ్వలేకపోయింది కానీ నాలుగైదు రోజుల తర్వాత ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుందని జోస్యం చెప్పాడు దిల్ రాజు.
అంతేకాదు సినిమాలోని మూడు పాటలు స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు ఆడియన్స్ కుర్చీల్లో కూర్చోరని, అంత గొప్ప డ్యాన్సులు సినిమాలో ఉన్నాయని ఫ్యాన్స్ ను ఊరించాడు దిల్ రాజు. అప్డేట్స్ గురించి నన్ను ఎంత తిట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదని, శంకర్ సిగ్నల్ ఇస్తే తప్ప తానేం చేయలేనని తెలిపాడు దిల్ రాజు. మొత్తానికి చరణ్ ఫ్యాన్స్ అనుకుంటున్నట్లు ఈ ఏడాది గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుంది. ఇంతకంటే గుడ్ న్యూస్ వాళ్లకు ఇంకేముంటుంది?