యువతకు, వృద్ధులకు చంద్రన్న తోఫా..
ఆంధ్ర రాష్ట్ర యువతకు, వృద్ధులకు టీడీపీ అధినేత చంద్రబాబు ఓ గుడ్ న్యూస్ ను తెలియజేశారు. ఈ సారి తామ అధికారంలోకి వస్తే ప్రభుత్వ శాఖలలో పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని.. తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. అలాగే వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ అందిస్తామని తెలియపరిచారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నేతృత్వంలో పెన్షన్ ఒక్క నెల తీసుకోలేకపోయినా ఇక ఆ డబ్బులు రావడం లేదని.. దీనివల్ల పెన్షన్ దారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అన్నారు. అయితే తమ ప్రభుత్వం వస్తే ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకుంటామని అన్నారు. ఏదన్నా అవసరార్థం బయటకు వెళ్లి ఓ రెండు మూడు నెలలు పెన్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఆ తరువాత నెల ఒకేసారిగా తీసుకునే వెసలు కల్పిస్తామని కావలిలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు చెప్పారు. బీసీలకు ప్రత్యేకమైన చట్టం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు ఆదాయ వనరులు పెంచడంతోపాటు ఖర్చులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మైనారిటీల హక్కులు కాపాడే బాధ్యత తమ పార్టీదని చంద్రబాబు తెలియజేశారు.