నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి
నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటా అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విపక్షాలు సహా సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని విషయాలను తనకు అంటగడుతున్నారని మండిపడ్డారు. గతంలో చెన్నైలో పట్టుబడిన బంగారు వ్యాపారి డబ్బు తనదని ప్రచారం చేసి, హవాల మంత్రి అని అవమానించారన్నారు. ఇటీవల కొత్తపట్నం మండలం అల్లూరు మహిళ గొడవలోకి తనను లాగుతున్నారని పేర్కొన్నారు. ఇందులో వైసీపీలోని పెద్ద నేతలు కూడా ఆమెతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తనకు తెలుసునన్నారు. వారికి ఏం అన్యాయం చేశానని ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించారు. అందరినీ ప్రశ్నిస్తానని పవన్ కల్యాణ్ అంటారు. మరి ఇంత జరుగుతుంటే తెలుగుదేశం పార్టీని ప్రశ్నించరా? అని అన్నారు.