విశాఖ మధురానుభూతులు అందిస్తుంది.. జీ20 అతిథులతో సీఎం జగన్
జీ20 సదస్సు కోసం విచ్చేసిన అతిథులతో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. విందు భోజనం చేసిన తర్వాత వారితో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే జీ20 రెండో ఇన్ఫ్రాస్ట్రకచ్చర్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్లో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా జీ20 అతిథులకు విశాఖపట్టణం ఒక మధురానుభూతిని మిగులుస్తుందని జగన్ చెప్పారు. ‘ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలనేదే మా లక్ష్యం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించాం. వీటిలో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఈ ఇళ్లు అన్నింటికీ మౌలిక సదుపాయాలు కల్పించడానికి మా ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. ఈ విషయంపై చర్చించి సస్టెయినబుల్ పద్ధతులు సూచించాలని కోరుతున్నా. ఈ విషయంలో సరైన మార్గనిర్దేశం అవసరం ఉంటుందని భావిస్తున్నాం. ఇలా చేస్తే పేదలకు మంచి ఇళ్లు దక్కుతాయి. ఈ ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు చూపాలి. ఈ విషయాలపై చర్చలు జరగాలి. ఇక్కడ మీరంతా గడిపే సమయం అందరికీ మధురానుభూతులు మిగులుస్తుందని ఆశిస్తున్నా’ అని జగన్ పేర్కొన్నారు.