ASBL NSL Infratech

భారత జి20 అధ్యక్షత... నవ్య బహుపాక్షికత: రేపటి ఉజ్వల భవితవైపు దిశానిర్దేశం - నరేంద్ర మోదీ

భారత జి20 అధ్యక్షత... నవ్య బహుపాక్షికత: రేపటి ఉజ్వల భవితవైపు దిశానిర్దేశం - నరేంద్ర మోదీ

భారతదేశం జి20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నేటితో 365 రోజులు పూర్తయ్యాయి. ‘‘వసుధైవ కుటుంబకం’’...  అంటే- ‘ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు’ స్ఫూర్తిని చాటేలా పునరంకితమవుతూ.. పునరుజ్జీవనానికి బీజం వేసిన క్షణమది.

మనం నిరుడు ఈ బాధ్యత స్వీకరించే నాటికి యావత్ ప్రపంచం బహుముఖ సవాళ్లతో సతమతం అవుతోంది. ఆ మేరకు క్షీణిస్తున్న బహుపాక్షికత నడుమ కోవిడ్-19 మహమ్మారి దుష్ప్రభావం నుంచి కోలుకోవడం, నానాటికీ పెరుగుతున్న వాతావరణ మార్పు సమస్యలు, ఆర్థిక అస్థిరత, వర్ధమాన దేశాల్లో రుణభారం తదితరాలన్నీ చోటు చేసుకున్నాయి. అలాగే ఘర్షణలు, వివాదాలు, స్పర్థాత్మకతల మధ్య ప్రగతి సంబంధిత సహకార భావన దెబ్బతిని, పురోగమనం కుంటుపడింది.

ఈ నేపథ్యంలో జి20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన భారతదేశం ఆనాటి  దుస్థితి నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించి, ప్రత్యామ్నాయం చూపాలని నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా జిడిపి కేంద్రక ప్రగతి నుంచి మానవ-కేంద్రక పురోగమనంవైపు మళ్లాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. మనమధ్య విభజన తెస్తున్న కారణాన్ని కాకుండా మనల్ని ఏది ఏకం చేయగలదో దానిగురించి గుర్తుచేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో అంతిమంగా అంతర్జాతీయ చర్చలు పరిణామశీలమై- కొందరి స్వార్థానికి కాకుండా అందరి ఆకాంక్షలు, ప్రయోజనాలకు పెద్దపీట వేయక తప్పలేదు. అయితే, ఇందుకోసం ముఖ్యంగా చేయాల్సిందల్లా బహుపాక్షికతలో మూలాల నుంచి సంస్కరణలు తేవడం.

‘‘సార్వజనీనత, ఆకాంక్షాత్మకత, కార్యాచరణాత్మకత, నిర్ణయాత్మతకత’’ అనే నాలుగు పదాలు జి20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో మన విధానమేమిటో సుస్పష్టంగా నిర్వచించాయి. అటుపైన జి20 సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించిన ‘న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం’ (ఎన్డీఎల్డీ) ఈ సూత్రాల అమలులో మన నిబద్ధతను ప్రస్ఫుటం చేసింది.

సార్వజనీనత అన్నది మన అధ్యక్ష పదవికి ఆత్మవంటిది. దీనికి అనుగుణంగా ఆఫ్రికా సమాఖ్య (ఎయు)కు జి20లో శాశ్వత సభ్యత్వం కల్పించడం ద్వారా 55 ఆఫ్రికా దేశాలను ఈ వేదికమీదకు చేర్చాం. దీంతో ప్రపంచ జనాభాలో 80 శాతానికి ప్రాతినిధ్యం వహించే విధంగా జి20 విస్తరించింది. తద్వారా అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలపై  మరింత సమగ్ర చర్చలను ఈ క్రియాశీల వైఖరి ప్రోత్సహించింది.

ఇక ‘దక్షిణార్థ గోళం దేశాల గళం’ పేరిట భారతదేశం తొలిసారి రెండు దఫాలుగా నిర్వహించిన శిఖరాగ్ర సదస్సు బహుపాక్షికత నవోదయానికి శుభారంభం పలికింది. ఆ విధంగా దక్షిణార్థ గోళ దేశాల సమస్యలను భారతదేశం అంతర్జాతీయ చర్చల ప్రధాన స్రవంతిలోకి తెచ్చింది. తద్వారా ప్రపంచ ప్రగతికి మార్గ ప్రణాళికలో వర్ధమాన దేశాలు తమవంతు ప్రాతినిధ్యం వహించే కొత్త శకానికి నాంది పలికింది.

సార్వజనీనత అన్నది భారత దేశీయ విధాన ఉత్తేజాన్ని జి20కి వ్యాపింపజేసింది. ఆ మేరకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి తగినట్లుగా జి20కి భారత నాయకత్వం ప్రజాధ్యక్షతగా రూపొందింది. ఈ మేరకు ‘‘ప్రజా భాగస్వామ్యం’’ కింద నిర్వహించిన అనేక కార్యక్రమాల ద్వారా 140 కోట్ల మంది పౌరులకు జి20 చేరువైంది. ఇందులో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకూ భాగస్వామ్యం ఇవ్వబడింది. అలాగే జి20 నిర్దేశాలకు అనువుగా వాస్తవిక అంశాలపై అంతర్జాతీయ దృష్టిని విస్తృత ప్రగతి లక్ష్యాల వైపు మళ్లించేలా భారత్ బాధ్యత వహించింది.

ప్రపంచం సాధించాల్సిన లక్ష్యాలపై 2030 నాటి గడువుకు నేడు మనం అత్యంత కీలకమైన మధ్యకాలంలో ఉన్నాం. అందువల్ల 2023కు సంబంధించి జి20 కార్యాచరణ ప్రణాళికను భారత్ రూపొందించింది. ఇది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)ను వేగవంతం చేయడంతోపాటు ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పర్యావరణ సమతౌల్యం, పరస్పర అనుసంధానిత సమస్యల పరిష్కారం కోసం విస్తృత కార్యాచరణ-ఆధారిత విధానం వగైరాలను సూచించింది.

ఈ ప్రగతి ప్రణాళిక పురోగమనానికి జనహిత మౌలిక సదుపాయాలు (డిపిఐ) అత్యంత కీలకం. ఆ మేరకు ‘ఆధార్, యుపిఐ, డిజిలాకర్’ వంటి డిజిటల్ ఆవిష్కరణల విప్లవాత్మక ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూసిన భారత్ తనవంతుగా నిర్ణయాత్మక సిఫారసులు చేసింది. జి20 ద్వారా మనం జనహిత మౌలిక సదుపాయాల భాండాగారం ఏర్పాటును విజయవంతంగా పూర్తి చేశాం. దీన్ని ప్రపంచ సాంకేతిక సహకారంలో గణనీయ పురోగమనంగా పేర్కొనవచ్చు. ఈ భాండాగారంలో 16 దేశాల నుంచి 50కిపైగా దేశాల ‘డిపిఐ’లున్నాయి. సమగ్రాభివృద్ధి శక్తిని సద్వినియోగం చేసుకునే దిశగా దక్షిణార్థ గోళ దేశాలు వీటిని అనుసరించడమేగాక, తమదైన ‘డిపిఐ’ల నిర్మాణం, వినియోగం కోసం ఈ భాండాగారాన్ని చక్కగా వాడుకోవాలి.

మన ఏకైక భూగోళం కోసం తక్షణ, శాశ్వత, సమాన మార్పు సృష్టి లక్ష్యంగా మనం  ప్రతిష్టాత్మక, సమగ్రమైన లక్ష్యాలను అనుసరిస్తున్నాం. భూగోళ పరిరక్షణ, పేదరిక నిర్మూలన నడుమ మన ఎంపికకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడం ఎలాగో ‘ఎన్డీఎల్డీ’ నిర్దేశిత ‘హరిత ప్రగతి ఒప్పందం’ వివరిస్తుంది. పరస్పర పూరకాలైన ఉపాధి-పర్యావరణ వ్యవస్థలు, వాతావరణ స్పృహతో వినియోగం, భూగోళ హిత ఉత్పాదనకు తగిన ప్రణాళికను సూచిస్తుంది. ఇక 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని  ప్రతిష్టాత్మక రీతిలో మూడు రెట్లు పెంచాలని కూడా జి20 తీర్మానం పిలుపునిచ్చింది. మరోవైపు ప్రపంచ జీవఇంధన కూటమి ఏర్పాటు, హరిత ఉదజని కోసం సమష్టి కృషి, పరిశుభ్ర, హరిత ప్రపంచ నిర్మాణంపై జి20 ఆదర్శాలు కాదనలేని నిజాలు. భారత్ అనాదిగా అనుసరిస్తున్న విలువలు ఇవే. అలాగే సుస్థిర జీవనం కోసం జీవనశైలి (లైఫ్) వంటివాటిద్వారా ప్రపంచం మన ప్రాచీన అనుసరణీయ సంప్రదాయాల ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

ఉత్తరార్థ గోళ దేశాల నుంచి గణనీయ ఆర్థిక సహాయంతోపాటు సాంకేతిక చేయూతను కోరడం ద్వారా వాతావరణ న్యాయం-సమానత్వం విషయంలో మన నిబద్ధతను కూడా ‘ఎన్డీఎల్డీ’ నొక్కి చెప్పింది. కాగా, అభివృద్ధికి ఆర్థిక చేయూత పరిమాణంలో తొలిసారిగా ఆశించన మేర రెట్టింపు పెరుగుదల నమోదైంది. ఆ మేరకు ఈ సాయం బిలియన్ల స్థాయి నుంచి ట్రిలియన్ల స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో వర్ధమాన దేశాలు 2030 నాటికి తమ దేశీయ ప్రగతి లక్ష్యాల (ఎన్డీసీ)ను సాధించడానికి $5.9 ట్రిలియన్ డాలర్లు అవసరమని జి20 అంగీకరించింది.

భారీ స్థాయిలో నిధుల సమీకరణ అవసరం దృష్ట్యా మెరుగైన, విస్తృత, ప్రభావశీల బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల ప్రాముఖ్యాన్ని కూడా జి20 సుస్పష్టం చేసింది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్ విషయంలోనూ భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఐరాస భద్రత మండలి వంటి ప్రధానాంగాల పునర్నిర్మాణం మరింత సమాన ప్రపంచ క్రమాన్ని నిర్ధారిస్తుంది.

న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం లింగ సమానత్వానికీ పెద్దపీట వేసింది. ఆ మేరకు ఇది వచ్చే ఏడాదికల్లా మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యాచరణ బృందం ఏర్పాటు అవసరాన్ని నొక్కిచెప్పింది. భారత మహిళా రిజర్వేషన్ బిల్లు-2023 ద్వారా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయించడం ద్వారా మహిళా చోదక ప్రగతిపై భారత్ నిబద్ధతను జి20 ప్రతిబింబించింది.

విధానపరమైన సమన్వయం, విశ్వసనీయ వాణిజ్యం, ప్రతిష్టాత్మక వాతావరణ కార్యాచరణపై దృష్టి సారిస్తూ ఈ కీలక ప్రాధాన్యాలన్నిటా పరస్పర సహకార స్ఫూర్తిని ‘ఎన్డీఎల్డీ’ చాటిచెప్పింది. మన అధ్యక్షత సమయంలో జి20 ద్వారా 87 నిర్ణయాలు తీసుకోవడంతోపాటు 118 పత్రాలకు ఆమోదం సాధించడం గర్వించదగిన అంశం. మునుపటితో పోలిస్తే ఇదెంతో గణనీయమైన పెరుగుదల.

మన జి20 అధ్యక్షత సమయంలో భౌగోళిక-రాజకీయాంశాలు, ఆర్థికవృద్ధి-ప్రగతిపై వాటి ప్రభావం వగైరాలపైనా చర్చలకు భారత్ నాయకత్వం వహించింది. ఉగ్రవాదం, విచక్షణ రహితంగా పౌరుల ప్రాణాలు తీయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని తుదముట్టించడమనే విధానంతోనే ఈ బెడదను నిర్మూలించడం సాధ్యమని స్పష్టం చేసింది. మనం శత్రుత్వం స్థానంలో మానవత్వాన్ని స్వీకరించాలి. ఆ మేరకు ఇది యుద్ధ యుగం కాదనే వాస్తవాన్ని పునరుద్ఘాటించాలి.

జి20 అధ్యక్ష బాధ్యతల సమయంలో భారత్ అసాధారణ విజయాలు సాధించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది: ఇది బహుపాక్షికతను పునరుజ్జీవింపజేసింది... దక్షిణార్థ గోళ దేశాల గళాన్ని మరింతగా వినిపించింది... ప్రగతి సాధనకు ప్రాముఖ్యమిచ్చింది... అన్ని రంగాల్లోనూ మహిళా సాధికారత కోసం పోరాడింది.

ఈ నేపథ్యంలో భూగోళం పచ్చగా పరిఢవిల్లడంతోపాటు ప్రపంచ ప్రజానీకానికి శాంతి-శ్రేయస్సు దిశగా ఇప్పటివరకూ మనం సమష్టిగా చేసిన కృషి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని విశ్వసిస్తూ జి20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ దేశానికి అప్పగిస్తున్నాం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :