సంజయ్ సింగ్ బెయిల్ ఆర్డర్పై బన్సురీ స్వరాజ్ పేరు.. మండిపడ్డ విపక్షాలు
లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం తీహార్ జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. 6 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అయితే ఆయన బెయిల్ పిటిషన్కు సంబంధించి ఓ విషయం వివాదాస్పదమవుతోంది. ఇందులో సుప్రీం కోర్టు సైతం కలుగజేసుకుని ఈడీకి చురకలంటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. బుధవారం సుప్రీం కోర్టులో సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. అయితే బెయిల్ మంజూరైన తర్వాత ఫైనల్ ఆర్డర్లో బీజేపీ నేత, అడ్వకేట్ బాన్సురి స్వరాజ్ పేరు ఉండడంపై సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఈడీ తరపు న్యాయవాది జొహెబ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఈ కేసులో బాన్సురీ స్వరాజ్ ఒక్కసారి కూడా న్యాయవాదిగా కోర్టు ముందు హాజరుకాలేదని, ఈడీ తరపున వాదనలు కూడా వినిపించలేదని, అయితే బెయిల్ ఆర్డర్లో పొరపాటున ఆమె పేరు చేర్చడం జరిగిందని చెప్పారు. దీంతో సుప్రీం ధర్మాసనం వెంటనే ఆమె పేరును తొలగించాలని ఆదేశించింది. కాగా.. న్యూ ఢిల్లీ లోక్సభ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాన్సురీ స్వరాజ్ పేరు సంజయ్ సింగ్ బెయిల్ ఆర్డర్పై ఉండడంతో ఇండియా కూటమి పార్టీకి చెందిన అనేకమంది నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఆప్ నేతలపై జరుగుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు బీజేపీ కుట్రేనని చెప్పడానికి ఇది మరో నిదర్శనమని ఆరోపిస్తున్నారు.