పౌరసత్వ సవరణ చట్టం వివాదం వెనక...?
భారత పౌరసత్వ చట్టం –1955ని సవరిస్తూ పార్లమెంటు తెచ్చిన చట్టం ఇది.పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చే హిందు, క్రిస్టియన్, జైన్, బుద్దిస్ట్, సిక్, పార్శీ మతాల వారు (ముస్లింలను మినహాయించి) ఆయా దేశాల నుంచి శరణార్థులుగా వచ్చి భారత దేశ పౌరసత్వాన్ని కోరితే వారికి మన దేశ పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన చట్టం ఇది.అక్రమంగా వలస వచ్చిన వారు ఆరేళ్లపాటు ఇక్కడ నివసిస్తే వీరికి పౌరసత్వం ఇస్తారు. డిసెంబరు 31, 2014లోపు ఇలా వచ్చినవారందరికీ పౌరసత్వం ఇచ్చే వెసులుబాటును ఈ చట్టం కల్పిస్తుంది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం 12 ఏళ్ల వ్యవధిలో .... మొత్తంగా 11 ఏళ్లు భారతదేశంలో నివసించి ఉండాలి. కానీ ఇప్పుడు ఈ తాజా చట్ట సవరణ వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చే హిందు, క్రిస్టియన్, జైన్, బుద్దిస్ట్, సిక్, పార్శీ మతాల వారికి ఈ 11 ఏళ్ల నిబంధనను ఆరేళ్లకు కుదించారు.
అయితే...ఆపదలో ఉన్న వారికి ఆశ్రయం కల్పించడంలో మతాన్ని ప్రాతిపదికగా ఎలా ఎంచుకుంటారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశంపై మత వివక్ష ముద్ర పడదా? ఆలోచించాలంటున్నాయి. ఈ చట్టంలో ముస్లింలకు పౌరసత్వాన్నివ్వకపోవడాన్ని తప్పుపడుతున్నాయి. ఉదాహరణకు.. శ్రీలంకలో ఉన్న హిందువులను ఎందుకు అనుమతించరు? అక్కడ తమిళులు వారి హక్కుల కోసం చేసిన పోరాటంలో ఊచకోతకు గురయ్యారు. వారికి కూడా పౌరసత్వం ఇవ్వొచ్చు కదా? అలాగే మయన్మార్లో బౌద్ధులు మెజారిటీలు. అక్కడ రోహింగ్యాలు మైనారిటీలు. రోహింగ్యాలు దాడులకు గురయ్యారు. మరి వారిని ఎందుకు అనుమతించరు? కేంద్రం చెబుతున్న ఇస్లామిక్ దేశాల్లో కూడా బోహ్రా, అహ్మదీయ తదితర ముస్లిం మతస్తులు మైనారిటీలుగా ఉన్నారు. వారిని ఎందుకు అనుమతించరు? అని బీజేపీయేతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
బంగ్లాదేశ్ నుంచి గతంలో ముస్లింలు కూడా పలు దాడులకు గురై మన దేశానికి వలస వచ్చారు. శ్రీలంక నుంచి పలు మతాల ప్రజలు మన దేశానికి వలస వచ్చారు. అందువల్ల వలసలను మతపరంగా చూడరాదని, ఇతర దేశాల్లో ప్రభుత్వాలు రక్షణ కల్పించలేని పరిస్థితిని మాత్రమే చూడాలని విపక్షాలు చెబుతున్నాయి. అన్ని మతాలను సమానంగా చూడాలన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే అవుతుందన్నది ఈ వర్గాల వాదన. భారతదేశం నుంచి వలస వెళ్లే హిందువులకు క్రైస్తవ మెజారిటీ దేశాలైన అమెరికా వంటి దేశాలు పౌరసత్వం నిరాకరిస్తే ఏంటి పరిస్థితి అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
దీనికి తోడు ఈ పథకం కింద ఇండియాకు వచ్చే వివిధ మతాల ప్రజలు.. స్థానికుల జనాభాను అధిగమించి కొత్త ఓటు బ్యాంకుగా మారే పరిస్థితులున్నాయి. ఇవి ఎక్కడ తమకు రాజకీయంగా ఇబ్బంది తెస్తుందో అన్న భయం కూడా వాటిని వెన్నాడుతోంది. ఉదాహరణకు బెంగాల్ సరిహద్దుల్లో ముస్లింల డామినేషన్ ఉంది. అక్కడ బంగ్లాదేశ్ నుంచి హిందువులు పెద్దసంఖ్యలో వలసొస్తే.. పరిస్థితి తలకిందులవుతుంది. దీంతో ఈ పరిస్థితి రాకుండా చూసేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా ఈ చట్టం కూడా రాజకీయ క్రీనీడ పడగలోనే ఉంది. తాము అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన పవన్ ఖేరా ప్రకటించారు కూడా. దీంతో ఈ చట్టం అమలు.. మరిన్ని సమస్యలను తెస్తుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.