పార్లమెంట్ లో గళం విప్పాలి : సీఎం కేసీఆర్
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలకు స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై లోక్సభ, రాజ్యసభ సభ్యులతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలన్నారు. ఎనిమిదేళ్లుగా విభజన హామీలు సహా పలు హక్కులను బీజేపీ ప్రభుత్వం తొక్కి పెడుతోందన్నారు.
బీజేపీ అసంబద్ధ వైఖరిని విపక్ష ఎంపీలతో కలిసి ఎండగట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి నిలిచిపోతోందన్నారు. సోయి ఉన్న తెలంగాణ బిడ్డలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని, అందుకు పార్లమెంట్ ఉభయ సభలే సరైన వేదికలుగా మలుచుకోవాలని ఎంపీలకు దిశానిర్ధేం చేశారు. అర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోదీ ప్రభుత్వం ఎన్నడూ ప్రోత్సహించలేదని, పైగా అడ్డుకునే కుట్రలకు పాల్పడుతోందని సీఎం దుయ్యబట్టారు. దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నాయని, కానీ, పరిధికి లోబడే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వ్యవహరాలు నడుపుతున్న తీరును ఎంపీలకు వివరించారు.