‘మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు’ కేసీఆర్పై బండి సంజయ్ సెటైర్లు
పార్లమెంట్ ఎన్నికల వేళ బస్సుయాత్రకు సిద్ధమైన కేసీఆర్పై కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా.. మోకాళ్ల యాత్ర చేసినా ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా బీఆర్ఎస్ను నమ్మడం లేదని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా జూన్ 4న విడుదల కానున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అనంతరం పెద్దపల్లి బ్రిడ్జ్ కూలిపోవడంపై స్పందించిన బండి సంజయ్.. బీఆర్ఎస్ హయాంలో కమీషన్లకు కక్కుర్తి పడి కట్టిన ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయని, అందుకు పెద్దపల్లి ఘటనే నిదర్శనమని అన్నారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శనాస్త్రాలు సంధించిన బండి సంజయ్.. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని, ప్రభుత్వ విధానాలపైన ప్రశ్నిస్తుంటే.. కొంతమంది మంత్రి పదవుల్లో ఉన్నామనే సోయి కూడా లేకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, బూతులు తిడుతున్నారని, ఇదెంతవరకు న్యాయమో ఆలోచించుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ అక్రమాలను, కాంగ్రెస్ వెన్నుపోటు విధానాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలే ఆ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.