ఆశల కన్నా భయాలే ఎక్కువ.. ప్రతి పది మందిలో ముగ్గురు
కొత్త సంవత్సరం అంతా బాగుంటుందని అందరూ ఆశిస్తారు. కానీ గడిచిన అనుభవాల దృష్ట్యా కొత్త సంవత్సరంలో తమ దేశం, మొత్తంగా ప్రపంచం ఎలా వుంటుందోనని మెజారిటీ అమెరికన్లు భయపడుతున్నారని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. గతేడాది చివరిలో యాక్సిస్ మొమెంటివ్ నిర్వహించిన సర్వేలో 51 శాతం మంది ప్రజలు కొత్త సంవత్సరంలో పరిస్థితి ఎలా వుంటుందోనన్న బెంగ వ్యక్తం చేశారు. ప్రపంచ పరిస్థితుల గురించి 54 శాతం మంది ప్రజలు కలవరపడుతున్నారు. ఆశల కన్నా భయాలే ఎక్కువగా వున్నాయని ప్రతి పది మందిలో ముగ్గురు చెప్పారు. 2020లో ఇలా చెప్పిన వారు 25 శాతం వుండగా, 2018లో 22 శాతంగా వున్నారు. డెమోక్రాట్ల కన్నా రిపబ్లికన్లు ఎక్కువ ఆశాభావంతో వున్నప్పటికీ రెండు గ్రూపులు ఎక్కువగా ప్రతికూలంగానే ఆలోచిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతమున్న ద్రవ్యోల్బణ ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు వీటన్నింటి దృష్టా కొత్త సంవత్సరం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సమస్యలు తప్పవని అంటున్నారు.