ASBL NSL Infratech

నాలుగు దశాబ్దాల ఠీవి...మారుతీ 800 ప్రభ.. పీపుల్స్ కార్...

నాలుగు దశాబ్దాల ఠీవి...మారుతీ 800 ప్రభ.. పీపుల్స్ కార్...

నాలుగు దశాబ్దాల క్రితం దేశంలో అంబాసిడర్, ప్రీమియర్ పద్మినీ హవా నడిచేది. అంబాసిడర్, ప్రీమియర్ పద్మినీ ఇంటిలో ఉందంటే.. వారు సంపన్నుల కింద లెక్క. మధ్య తరగతి వారికి కారంటే అందని స్వప్నమే. అలాంటి పరిస్థితిలో విడుదలైన మధ్యతరగతి వారి ఆశలవారధి, మారుతీ 800.. దేశవ్యాప్తంగా విస్తరించింది. దేశంలో అత్యధికంగా ఉన్న మధ్యతరగతి ప్రజలు... తమ ఇంటిలో మారుతీ 800 ఉండాలని ఆశగా కోరుకున్నారంటేనే.. ఈకారు వారిని ఎంతగా ఆకట్టుకుంది.. ఎంతగా వారి మనసులకు దగ్గరైందో అర్థం చేసుకోవచ్చు.

1983 డిసెంబరు 14న విడుదలైన చిన్న కారు మారుతీ 800.. దేశంలో మధ్యతరగతి ప్రజలకు చేరువై, కారు కొనాలనే పెద్ద ఆశను తీర్చడమే కాదు ప్రజల కారుగా నిలిచింది. మన రోడ్లపై తొలిసారి పరుగులు తీసే సమయానికి ఈ కారు ధర రూ.48,000 మాత్రమే. అందుబాటు ధర, తక్కువ నిర్వహణ ఖర్చు, ఎక్కువ మైలేజీ, మన రోడ్లకు తగినట్లుగా కాంప్యాక్ట్‌ పరిమాణంలో ఉండడం.. ఇవే మారుతీ 800 విజయ రహస్యాలు. దక్షిణ ఢిల్లీలోని మారుతీ సుజుకీ భారత ప్రధాన కార్యాలయంలోని బ్రాండ్‌ సెంటర్‌లో చూస్తే, ఆధునాతన మోడళ్ల మధ్య ఠీవిగా మారుతీ 800 (ఎమ్‌800 మోడల్‌) కనిపిస్తుంది.

మారుతీ విడుదలయ్యే సమయానికి లైసెన్స్‌రాజ్‌ ఉండేది. అప్పట్లో అనేకమంది మారుతీ 800 కారును సొంతం చేసుకునేందుకు పోటీపడగా, 1983లో తీసిన డ్రాలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగి హర్పాల్‌ సింగ్‌ తొలి కారును దక్కించుకున్నారు. ఆ తర్వాత మూడేళ్లకే లక్ష కార్లు అమ్ముడుపోయాయంటే ఆ మోడల్‌కు వచ్చిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు. అప్పటికి మన మార్కెట్లో ఉన్న ఇతర కార్లతో పోలిస్తే , జపాన్‌కు చెందిన సుజుకీ మెరుగైన సాంకేతికతను వినియోగించి తీసుకొచ్చిన మారుతీ 800 లక్షల మంది మధ్యతరగతి వర్గీయుల ఇళ్లలోకి చేరింది. పాతికేళ్లలోపే 25 లక్షల ఉత్పత్తిని సాధించింది.

భద్రత, ఉద్గార నిబంధనలు కఠినతరం కావడానికి తోడు.. ఆర్థిక సంస్కరణల ఫలితంగా అనేక సంస్థల నుంచి తీవ్రపోటీ ఎదురవ్వడం, మారుతీ సుజుకీ తన చిన్నకారు మోడల్‌లోనూ మార్పులు చేసింది. మారుతీ 800 ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు 2014 జనవరి 18న ప్రకటించింది. అప్పటికి దేశీయంగా 26.8 లక్షల కార్లను విక్రయించగా.. 2.4 లక్షల కార్లను ఎగుమతి చేశారు. అంటే 29.2 లక్షల కార్లు విక్రయమయ్యాయన్న మాట.

సచిన్‌, గోవిందాల తొలి కారు

అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ మారుతీ లిమిటెడ్‌కు తొలి మేనేజర్‌గా వ్యవహరించారు. ఆయన జయంతి సందర్భంగానే ఇందిరా గాంధీ తొలి 4 కార్లను ప్లాంటు నుంచి విడుదల చేశారు. క్రికెటర్‌ సచిన్‌ తెండూల్కర్‌, నటుడు గోవిందా కొనుగోలు చేసిన తొలి కారు ఇదే.పేరుకు తగ్గట్లే 800 సీసీ ఇంజిన్‌తో వచ్చిన ఈ కారు.. అంబాసిడర్‌ తర్వాత అత్యధిక కాలం పాటు (31 ఏళ్లకుపైగా) ఉత్పత్తి అయిన మోడల్‌గా నిలిచింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :