ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

భారీ తారాగణంతో టిటిఎ కన్వెన్షన్ వేడుకలు

భారీ తారాగణంతో టిటిఎ కన్వెన్షన్ వేడుకలు

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యూజెర్సిలో మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌ ప్రారంభానికి సిద్ధమైందని టిటిఎ అధ్యక్షుడు మోహన్‌ పాటలోళ్ళ, కన్వెన్షన్‌ కన్వీనర్‌ శ్రీనివాస గనగోని తెలిపారు.  ఈ కన్వెన్షన్‌ లో ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమంది కళాకారుల ప్రదర్శనలతోపాటు బిజినెస్‌ సెమినార్‌లు, యూత్‌ కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, జబర్దస్త్‌, పొలిటికల్‌ ఫోరం, పాలసీ చర్చా కార్యక్రమాలు, సమావేశాలు, టిటిఎ మాట్రిమోనియల్‌ ద్వారా వధూవరుల పరిచయ వేదికను కూడా ఈ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేశారు. అమెరికాలో మొదటిసారిగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఈ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు. 

 మే 27వ తేదీ నుండి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని కాన్ఫరెన్స్‌ కమిటీ కన్వీనర్‌  శ్రీనివాస్‌ గనగోని, టిటిఎ అధ్యక్షుడు  మోహన్‌ రెడ్డి పాటలోళ్ళ తెలిపారు.

న్యూజెర్సీ కన్వెన్షన్‌ సెంటర్లో 27వ తేదీ రాత్రి బాంక్వెట్‌ కార్యక్రమంతో వేడుకలు ప్రారంభం అవుతాయని, ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు అవార్డులను కూడా బహుకరిస్తున్నామని వారు చెప్పారు. అనంతరం సినీ సంగీత దర్శకుడు కోటి బృందంచే మ్యూజికల్‌ నైట్‌ ఉంటుందని తెలిపారు.

28వ తేదీ ఉదయం తెలంగాణ వైభవాన్ని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా స్వాగత నృత్యం గీతం ఉంటుందని తెలిపారు. దీనిని జొన్నవిత్తుల, వడ్డేపల్లి కృష్ణ రూపొందించారని వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించారని తెలిపారు. న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మరఫీ స్థానిక సెనేటర్‌ మేయర్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు అనంతరం సాయంత్రం ప్రముఖ సింగర్‌ సునీత బృందంచే సంగీత విభావరి ఉంటుందని తెలిపారు. రసమయి బాలకిషన్‌ బృందం ప్రదర్శన ఉంటుందని తెలిపారు. సినిమా నటీనటులు నిఖిల్‌ రితూ వర్మ అంజలి జబర్దస్త్‌ బృందం ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.

మూడవరోజు ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అమెరికాలో తొలిసారిగా ఈ కళ్యాణాన్ని తమ వేడుకల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణోత్సవంకోసం యాదాద్రి నుంచి అర్చకులు ఇక్కడకు వస్తున్నారని వారు చెప్పారు.

 రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మెగాకన్వెన్షన్‌లో హైలైట్‌గా దేవిశ్రీ ప్రసాద్‌ లైవ్‌ సంగీత కచేరి నిలవనున్నది. రాక్‌స్టార్‌ తన సంగీతంతో కన్వెన్షన్‌కు వచ్చినవారిని ఆనందపరచనున్నారు. రంజిత్‌, సాగర్‌, గీత, రీట, మౌనిమ తదితరులు ఈ లైవ్‌ సంగీత కార్యక్రమంలో పాటలు పాడి అందరినీ ఆకట్టుకోనున్నారు.  సింగర్‌ ఉష, సింగర్‌ సునీత, కాప్రిసియో బ్యాండ్‌ ద్వారా మ్యూజికల్‌ షో వంటి ఉల్లాసభరిత కార్యమ్రకమాలతోపాటు మహిళలకు వివిధ రకాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమాలకు యాంకర్‌లుగా సుమ, రవి వ్యవహరిస్తున్నారు.

ఈ వేడుకల్లో సినిమా నటీనటులతోపాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరవుతున్నారు. తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు ,సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్‌, జగదీశ్వర్‌ రెడ్డి, భాజపా నేతలు డి .అరవింద్‌, డీకే అరుణ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తదితరులు హాజరవుతున్నారు.

కాన్ఫరెన్స్‌కు అనుబంధంగా వాణిజ్యం ఐటీ మహిళ రాజకీయం యువత మ్యాట్రిమోనీ తదితర సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ అటార్నీ లతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. టిటి స్టార్‌ సింగర్‌ ను వేడుకల్లో ప్రకటిస్తామని తెలిపారు. యువత కోసం క్రూయిజ్‌ పర్యటన ఏర్పాటు చేసినట్లు తెలిపారు .తెలంగాణ వైభోగం సాంప్రదాయం చాటిచెప్పే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 

Tags :