ASBL NSL Infratech

“తానా మరియు టాంటెక్స్ సంయుక్త ఆద్వర్యంలో శ్రీ జొన్నవిత్తుల తో ఘనంగా “చమత్కార చతుర్ముఖ పారాయణం”

“తానా మరియు టాంటెక్స్ సంయుక్త ఆద్వర్యంలో శ్రీ జొన్నవిత్తుల తో ఘనంగా “చమత్కార చతుర్ముఖ పారాయణం”

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంయుక్తంగా జూలై 21 న ఆహా! ఈహీ! ఒహో! తెలుగు సాహితీ వైభవ కార్యక్రమాన్ని డాలస్ లో ఘనంగా నిర్వహించారు. దాదాపుగా 200 మందికి పైగా సాహితీ ప్రియులు 4 గంటల పాటు ఆసక్తితో, ఉత్సాహంగా కదలకుండా కూర్చుని సభని జయప్రదం చేశారు.

సాంబ దొడ్డ, తానా - డల్లాస్ ఫోర్ట్ వర్త్ ప్రాంతీయ ప్రతినిధి తన స్వాగతోపన్యాసం లో తానా మరియు టాంటెక్స్ సంస్థలు కలసి పనిచేస్తూ మున్ముందు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ముందుగా సాహితీ వేముల, సింధూర వేముల లు ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ మరియు ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట’ అనే ప్రారంభగీతాలను శ్రావ్యంగా ఆలపించారు.

తానా బోర్డు కార్యదర్శి మురళి వెన్నం, ప్రముఖ సినీ గేయరచయిత, తెలుగు వేదకవి, శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి స్వాగతం పలికి,  కొత్తగా ఎన్నికైన తానా సభ్యులను సభకు పరిచయం చేసి, భావసారుప్యం ఉన్న ఇతర తోటి జాతీయ మరియు స్థానిక  సంస్థలతో కలసి పనిచేస్తూ తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకై మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.  

టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు మట్లాడుతూ శ్రీ జొన్నవిత్తుల రామలింగెశ్వర రావు గారు ముఖ్య అతిధిగా రావడం చాలా ఆనందంగా ఉందని, తానాకి కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులందరకి అభినందనలు తెలియజేశారు. తానా జాతీయస్థాయిలో తెలుగు వారందరికి మాతృ సంస్థ అని, గతంలో తానా, టాంటెక్స్ కలసి పని చేశాయని ఇకముందుకూడా అలాగే పరస్పర సహకారం తో మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేశారు.

తానా మరియు టాంటెక్స్ సంస్థల పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిధి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారిని సభకు పరిచేయం చేస్తూ శ్రీ జొన్నవిత్తులగారు శ్రీ శ్రీ, దాశరథి, వేటూరి, పురాణం సుభ్రమణ్యం శర్మ, డా. మంగళంపల్లి బాలమురళికృష్ణ, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి లాంటి అనేకమంది లబ్ధప్రతిష్టులతో ఎంతో ఆత్మీయంగా మెలిగి ఎన్నో అనుభవాలను సొంతం చేసుకున్నఆస్తిపరుడని వేదిక పైకి ఆహ్వానించినపుడు కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. శ్రీ జొన్నవిత్తుల గారితో వినూత్నం గా మొదటిసారిగా “చమత్కార చతుర్ముఖ పారాయణం” అనే నాల్గు ప్రక్రియలున్న సాహిత్యకార్యక్రమం ఏర్పాటు చేశామని ప్రసాద్ తోటకూర సభకు తెలియజేసారు. ఈ చతుర్ముఖ పారాయణం లో ‘సినీ సాహిత్యం’, ‘తెలుగు భాషా వైభవం’, ‘పురాణాల ప్రాశస్త్యం’, ‘పేరడీపాటలు’ అనే నాల్గు విభాగాలుగా విభజించి ఒక కొత్త తరహ కార్యక్రమానికి డాలస్ లో శ్రీకారం చుట్టామని డా. ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. తానా కార్యవర్గ సభ్యుడు లోకేష్ నాయుడు ముఖ్య అతిధి శ్రీ జొన్నవిత్తుల గారిని పుష్పగుచ్చంతొ ఆహ్వానం పల్కారు. 

ప్రముఖ తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల మాట్లాడుతూ డా. ప్రసాద్ తోటకూర గారితో తనకున్న ఎన్నో సంవత్సరాలు అనుబంధాన్ని, వారికున్న తెలుగు భాషా ప్రియత్వాన్ని, నాయకత్వ లక్షణాలను కొనియాడి ఇది తన 17వ అమెరికా పర్యటన అని తానా, టెంట్ క్స్ లాంటి అనేక తెలుగు సంస్థలు తనకిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదన్నారు.

డా. ప్రసాద్ తోటకూర జొన్నవిత్తుల గారితో ముఖాముఖి నిర్వహిస్తూ -  కవి జొన్నవిత్తుల ఎన్నో సినిమాలలో అత్యంత ప్రజాదరణ పొందిన వినూత్న ప్రయోగాలతో పాటలు ఉదాహరణకు - ఒక డిస్కో పాటని పూర్తిగా సంస్కృతంలో రాయడం, కేవలం “స రి గ మ ప ద ని” అనే సప్త అక్షరాలతో పాట రాయడం, ‘చినుకు చినుకు అందెలతో’ అనే ఆయన రాసిన పాటను బాబూ మోహన్, సౌందర్యలపై చిత్రీకరించడం, ‘జగదానంద కారకా’, ‘ఓ వాలు జడా, పూలజడా’ లాంటి పాటల నేపధ్యం గురించి అడిగినప్పుడు అదంతా దర్శక, నిర్మాతలు తనికిచ్చిన అవకాశం అని వారికి కృతజ్ఞతలు తెల్పారు. జొన్నవిత్తుల గారు డా. మంగళంపల్లి బాలమురళి, బాపు, రమణ, వేటూరి గార్లతో తనకున్న ప్రత్యేక అనుభందాన్ని, అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటూ, అలాంటి గొప్ప పండితులతో, మేధావులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం రావడం తన పూర్వజన్మసుకృతం అని చెప్పారు.

కనకదుర్గమ్మవారిరూపంలో అక్షరమాలను, అక్షరమాలలో సకల సంగీత వాయిద్య పరికరాలను దర్శిస్తూ తెలుగు భాషా వైభవాన్ని అనేక పద్యాలలో శ్రీ జొన్నవిత్తుల పాడి వినిపించడంతో సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. కోనసీమ శతకం, బతుకమ్మ శతకం, సింగరేణి శతకం, రామలింగేశ్వర శతకం లాంటి శతకాల్లోoచి ఎన్నో పద్యాలను శ్రావ్యంగా పాడి వినిపించడంతో అందరూ ఆనంద పరవసులయ్యారు. సమకాలీన సమాజ పరిస్థితుల్లో రాజకీయ పార్టీల గందరగోళం, యధేచ్చగా పార్టీలు మారడం, ఎన్నికల వాగ్ధానాలు, మద్యపానం, అవినీతి, స్కీములు, స్కాములులాంటి ఎన్నోఅంశాలను కధావస్తువులుగా చేసుకుని పేరడీలు సృష్టించి శ్రీ జొన్నవిత్తుల పాడటంతో సభలో ఉన్నవారంతా నవ్వులు, కేరింతలతో ఆనందడోలికల్లో మునిగిపోయారు.  

శ్రీ జొన్నవిత్తుల గారిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపిక ఇచ్చి, "అభినవ చమత్కార కవిసార్వభౌమ" అనే బిరుదుతో సత్కరించారు. తరువాత టాటా, ఆటా, నాటా జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా కవి జోన్నవిత్తులను  సత్కరించారు. సభకు విచ్చేసిన జ్యోతిష్య శాస్త్ర ప్రముఖులు డా. జంధ్యాల భాస్కర శాస్త్రి గారు శ్రీ జొన్నవిత్తులగారిని, వారి కవితా చాతుర్యాన్ని కొనియాడారు. నిర్వాహకులు డా. జంధ్యాల భాస్కర శాస్త్రి గారిని గౌరవపూర్వకంగా శాలువాతో సత్కరించారు.

ఈ సభలోనే ఉన్న ముగ్గురు తానా పూర్వధ్యక్షులు డా. నవనీత కృష్ణ గొర్రెపాటి, డా. రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట, డా. ప్రసాద్ తోటకూరలను తానా కార్యవర్గం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం డా. అడుసుమిల్లి రాజేష్, చలపతి కొండ్రకుంట, శ్రీకాంత్ పోలవరపు, దినేష్ త్రిపురనేని, సతిష్ కొమ్మన, రాజ నల్లూరి, రవి అల్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, పరమేష్ దేవినేని, శేషారావు బొడ్డు, శివ రావూరి, లోకేష్ నాయుడు కొణిదాల, సుబ్బరావు కారసాల, శ్రీని మండువ, అనిల్ ఆరేపల్లి, రావు కల్వల, డా. సి.ఆర్.రావు, డా. విశ్వనాధం పులిగండ్ల, ఎం.వి.యల్.ప్రసాద్, టాంటెక్స్ పూర్వధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, విజయ్ కాకర్ల, రాజా రెడ్డి, గీతా దమ్మన్న, ఆర్.కె పండిటి, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ తోపుదుర్తి, శ్రీకాంత్ జొన్నల, టాటా అధ్యక్షులు విక్రం జంగం, నాటా ఉత్తరాధ్యక్షులు డా. శ్రీధర్ రెడ్డి కొర్శపాటి, ఆటా బోర్డు అఫ్ డైరెక్టర్ సతీష్ రెడ్డి తో సహా ఎంతో మంది పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారికి, విజయవంతం కావడానికి సహకరించిన వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు, టివి5 మరియు ఇతర మీడియా ప్రతినిధులకు నిర్వాహకులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. తెలుగు వేద కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు తనకు జరిగిన ఘన సన్మానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిరాటంకంగా నాలుగు గంటల పాటు వందలాదిమంది సాహితీప్రియులు, తెలుగు భాషపై ఉన్న మమకారంతో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం తన జీవితంలో మర్చిపోలేని ఘటన అని ఉద్వేగభరితంగా అన్నారు.

“ఈ సాహితీ సమావేశం తర్వాత మహాత్మా మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర తో కలసి అమెరికా లోనే అతి పెద్దదైన 18 ఎకరాల పార్క్ లో నెలకొల్పిన మహాత్మాగాంధీ స్మారక ప్రాంతాన్ని సందర్శించి గాంధీజీకి పుష్పాంజలి ఘటించడం ఒక మధురానుభూతి అని, ఈ మహాత్మాగాంధీ స్మారక నిర్మాణం వెనుక ఉన్న డా. తోటకూర ప్రసాద్ గారి అనేక సంవత్సరాల కృషి, అకుంటిత దీక్ష ఎంతో కొనియాడ దగ్గది” అని కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. 

Click here for Event Gallery

Tags :