అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం
అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్థులు వరుసగా ప్రమాదాలకు గురవడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ తెలుగు విద్యార్థి షికాగోలో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ లేదని అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత్కు చెందిన విద్యార్థి రూపేశ్ చంద్ర చింతకింది మే 2వ తేదీ నుంచి కన్పించట్లేదని తెలిసి కాన్సులేట్ ఆందోళన చెందుతోంది. అతడి ఆచూకీ కోసం పోలీసులు, ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలో రూపేశ్ జాడ తెలుస్తుందని ఆశిస్తున్నాం అని షికాగాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అటు పోలీసులు కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. అతడి గురించి తెలిస్తే సమాచారం అందించాలని స్థానికులను కోరారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రూపేశ్ ప్రస్తుతం విస్కాన్సిన్లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అతడు అదృశ్యమైనట్లు తెలియగానే కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను, అమెరికా ఎంబసీని అభ్యర్థించారు.