ASBL NSL Infratech

లాస్ ఏంజెల్స్ లో లోకేష్ సమావేశం సక్సెస్

లాస్ ఏంజెల్స్ లో లోకేష్ సమావేశం సక్సెస్

అమెరికా పర్యటనలో భాగంగా లాస్‌ఏంజెలిస్‌లో నారా లోకేష్‌తో నిర్వహించిన తొలి సమావేశం విజయవంతమైంది. ఈరోజు ఉదయం బే ఏరియా చేరుకున్న నారా లోకేష్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. తరువాత ఎన్నారై టీడిపి లాస్‌ ఏంజెలిస్‌ ఆధ్వర్యంలో 100 కార్లతో ర్యాలీగా బయలుదేరి సమావేశస్థలమైన షెరటాన్‌ సెర్రితోస్‌కు లోకేష్‌ చేరుకున్నారు. లోకేష్‌ రాకముందే సమావేశ స్థలానికి తెలుగుదేశం పార్టీ అభిమానులు, మిత్రులు, ఇతరులు చేరుకోవడం ఆ సమావేశ ప్రాంగణమంతా కోలాహలంగా కనిపించింది. దక్షిణ కాలిఫోర్నియా నలుమూలల నుంచి 600 మందికిపైగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్‌ రవి ఆలపాటి ప్రారంభోపన్యాసం చేశారు. ఎన్టీఆర్‌ స్మృతులను నెమరువేసుకుంటూ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నారా లోకేష్‌ను అందరూ సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌ మాట్లాడుతూ, స్మార్ట్‌ విలేజ్‌ - స్మార్ట్‌ వార్డ్‌ కార్యక్రమం ప్రాముఖ్యత, అందులో ఎన్నారైల క్రియాశీలక పాత్ర గురించి వివరించారు. ఎన్నారైలు అందరూ కలిసి రెండు తెలుగు రాష్ట్రాలకు తమవంతు సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడిపి లాస్‌ ఏంజెలిస్‌ మూడు తీర్మానాలను నారా లోకేష్‌కు అందించింది.

ఎన్నారై తెలుగువారి ప్రతిభాపాటవాలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఉపయోగపడేలా తెలుగుదేశం పార్టీ పాటుపడాలని పిలుపునిచ్చింది.

అంతర్జాతీయంగా ఉన్న తెలుగుదేశం పార్టీ విభాగాలను (లాస్‌ ఏంజెలిస్‌, డాలస్‌, బే ఏరియా, న్యూజెర్సి ఇతర నగరాల్లో) మాతృరాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో సమన్వయం ఉండేలా చూడాలని కోరారు.

నారా లోకేష్‌ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రభుత్వంలో కూడా తన సేవలు అందించాలని, ప్రగతికి పాటుపడాలని కోరారు

ఈ మేరకు తాము తీర్మానం చేసినట్లు వారు నారా లోకేష్‌కు వివరించారు. తరువాత నారా లోకేష్‌ వచ్చినవారు అడిగిన ప్రశ్నలకు చురుకుగా సమాధానాలిచ్చారు. లోకేష్‌ సమాధానంతో అందరూ సంతృప్తి చెందారు. లోకేష్‌ ఇచ్చిన పిలుపుమేరకు ఒక్క లాస్‌ ఏంజెలిస్‌లోని తెలుగువారు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) ఆధ్వర్యంలో 126 గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చి అమెరికాలోని తెలుగువారందరికీ ఆదర్శంగా నిలిచారు.


Click hrere for PhotoGallery

 

Tags :